టాలీవుడ్ జక్కన్న రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ సినిమా ‘బాహుబలి’.ప్రభాస్ ద్విపాత్రాభినం చేస్తున్న ఈ సినిమాలో అనుష్క, తమన్నాలు హీరోయిన్లుగా నటిస్తున్నారు.
రానా ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు.ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి అయ్యింది.
మొదటి పార్ట్ను మే 15న విడుదల చేయబోతున్నట్లుగా కొన్ని రోజుల క్రితం రాజమౌళి స్వయంగా ప్రకటించాడు.అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా మేలో విడుదల కావడం లేదని తెలుస్తోంది.
అయితే ఇది ఎంత వరకు నిజం అనేది మాత్రం తేలాల్సి ఉంది.‘బాహుబలి’ని మళ్లీ వాయిదా వేస్తున్నట్లుగా ఇప్పటి వరకు చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా చెప్పింది లేదు.
కాని ఇతర సినిమాల నిర్మాతలు ‘బాహుబలి’ వాయిదా పడ్డట్లే అన్న ఉద్దేశ్యంతో తమ సినిమాలను ఆ సమయంలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.ఇప్పటికే రామ్ ‘పండుగ చేస్కో’ సినిమాను మే రెండవ వారంలో విడుదల చేయాలని నిర్ణయించారు.
తాజాగా పూరి తనయుడు ఆకాష్ నటించిన ‘ఆంధ్రాపోరి’ సినిమాను మే 15న విడుదల చేయబోతున్నట్లుగా నిర్మాత పేర్కొన్నాడు.ఇక గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రుద్రమదేవి’ కూడా మేలోనే విడుదలకు సిద్దం అవుతోంది.
‘బాహుబలి’ సినిమా జులైలో విడుదల అవుతుందనే నమ్మకంతోనే వీరంత కూడా మేలో తమ సినిమాలను విడుదల చేసేందుకు సిద్దం అవుతున్నారు.