యూపీ తరహాలో ఏపీలోనూ బుల్డోజర్ దాడులు జరుగుతున్నాయి.ప్రతిపక్ష టీడీపీకి చెందిన మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఇంటి గోడను వైసీపీ ప్రభుత్వాధికారులు ఇటీవల బుల్డోజర్తో కూల్చేశారు.
చోడవరం మినీ మహానాడులో సీఎం జగన్పై, మంత్రి ఆర్కే రోజాపై అయ్యన్నపాత్రుడు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆరోపిస్తూ విశాఖ జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నించగా టీడీపీ వర్గాలు అడ్డుకున్నాయి.అటు ఓ స్థలం ఆక్రమణ వ్యవహారంలోనూ అయ్యన్న పాత్రుడికి నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు, మున్సిపల్ అధికారులు ఆయన ఇంటికి వెళ్లారు.
అయితే అయ్యన్నపాత్రుడు సకాలంలో స్పందించకపోవడంతో అయ్యన్న ఇంటి వెనకాల గోడను బుల్డోజర్ సహాయంతో అధికారులు కూల్చివేశారు.పంట కాల్వ ఆక్రమించి గోడ కట్టారని, ప్రభుత్వ భూమిలోని రెండు సెంట్లు ఆక్రమించారని నర్సీపట్నం మున్సిపల్ కమిషనర్ జారీ చేసిన నోటీసుల్లో పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో కావాలనే తమ ఇంటి గోడ కూల్చివేశారంటూ అయ్యన్నపాత్రుడు కుటుంబం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.ఇటువంటి బుల్డోజర్ చర్యలు రానున్న కాలంలో ఇంకా ఉంటాయని ప్రతిపక్ష టీడీపీ భావిస్తోంది.
ఇటువంటి చర్యలు తమకే లాభం అని టీడీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు.
మరో 30 ఏళ్లు అధికారంలో ఉండాలని కలలు కంటున్న వైసీపీ నేతలు అనుసరించాల్సిన వైఖరి మాత్రం ఇది కాదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.మరోవైపు టీడీపీ నేతలు అక్రమంగా హౌస్ అరెస్టులు చేయడం వంటివి కూడా ఆ పార్టీకే లాభం చేకూరుస్తాయని స్పష్టం చేస్తున్నారు.తాము ఆడింది ఆట.పాడింది పాట అన్న చందంగా వైసీపీ నేతలు వ్యవహరించడం సరికాదని హితవు పలుకుతున్నారు.ఏపీలో బుల్డోజర్ రాజకీయాలకు తెర తీయడం దుర్మార్గమని సీపీఐ నేత రామకృష్ణ కూడా ఆరోపించారు.
మోదీ సర్కార్ బుల్డోజర్ రాజకీయాలను ఏపీలో జగన్ సర్కార్ అనుసరించటం విచారకరమన్నారు.ప్రతిపక్షాల విమర్శలను ప్రజాస్వామ్య పద్ధతిలో ఎదుర్కోవాలే తప్పితే ఈ తరహా బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలకు పాల్పడటం సరికాదన్నారు.