యాదాద్రి భువనగిరి జిల్లా: రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో మునిగి , విధులకు డుమ్మా కొడుతున్న కొందరు ఉపాధ్యాయుల వద్ద నెలనెలా లంచాలు వసూలు చేస్తూ ప్రభుత్వ పాఠశాలల పతనానికి కారణమైన యాదాద్రి భువనగిరి జిల్లా డిఈవో నారాయణ రెడ్డి, చౌటుప్పల్ ఎంఈవో నాగవర్ధన్ రెడ్డి లను తక్షణమే సస్పెండ్ చేయాలని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మేకపోతుల నరేందర్ గౌడ్ డిమాండ్ చేశారు.శుక్రవారం హైదారాబాద్ లోని విద్యాశాఖ పాఠశాల కమిషనర్ దేవసేనకు తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2022-23 విద్యా సంవత్సరంలో ఒక సామాజిక వర్గానికి చెందిన కొందరు ఉపాధ్యాయులు సంఘ నాయకులుగా చలామణి అవుతూ, రియల్ ఎస్టేట్ వ్యాపారులుగా మారి, డిఈవో కార్యాలయంలో చక్రం తిప్పతున్న ఏడి ప్రశాంత్ రెడ్డి,ఎంఈవో నాగవర్దన్ రెడ్డితో కలిసి కుట్ర పన్ని,
అప్పడు డిఈవోగా ఉన్న బీసీ వర్గానికి చెందిన కానుగ నర్సింహను తొలగించి, తమకు అనుకూలంగా ఉన్న వరంగల్ డైట్ కాలేజ్ ప్రిన్సిపాల్ నారాయణ రెడ్డికి వరంగల్ కు చెందిన ప్రముఖ ఉపాధ్యాయ సంఘ నాయకుడి ద్వారా ఇక్కడ పోస్టింగ్ ఇప్పించి తాము ఆడిందే ఆట పాడిందే పాటగా పదుల సంఖ్యలో పంతుల్లకు తమకు అనుకూలమైన ప్రాంతాలకు డిపుటేషన్లు ఇప్పించి సర్కార్ బడుల మూతకు కారణమై, బడుగు బలహీనవర్గాలకు చెందిన పిల్లల జీవితాలను నాశనం చేశారని ఆరోపించారు.వీరి అవినీతి అక్రమాలపై స్పందించిన బీసీ,ఎస్సీ,ఎస్టీ సంఘాల నాయకులు,మీడియా ప్రతినిధులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ తమకున్న రాజకీయ పలుకుబడితో తప్పించుకున్నారని తెలిపారు.
గత జనవరి నెలలో గ్రామస్తుల ఫిర్యాదు మేరకు పత్రికా విలేఖరులకు పట్టుబడిన నిరంజన్ రెడ్డి అనే ఉపాధ్యాయుడిని గత 2 ఏళ్లుగా ఒక్క రోజు కూడా బడి మొఖం చూడకున్నా ఇంటి వద్దకే రిజిస్టర్ పంపి సంతకాలు చేయించి అతడికి నెలకు లక్షల్లో జీతాలు ఇప్పించినారని,
సంస్థాన్ నారాయణపురం మండలంలోని రాచకొండ పాఠశాలలో పిల్లలు లేకున్నా రంగారెడ్డి అనే ఉపాధ్యాయుడిని అక్కడే వుంచి వారానికి ఒకసారి అదీ 11 గంటలకు వచ్చి 2 గంటకు పోయేట్లుగా చేసి నెలకు లక్షన్నర జీతం చెల్లించారని,సదరు ఉపాధ్యాయుడు ఎంఈవో దగ్గరి బంధువు కావడం వల్లే జరిగిందన్నారు.పక్కనే గల 5 దోనాల తండాలో శ్రీనివాస్ రెడ్డి అనే ఉపాధ్యాయుడు పాఠశాలకు సరిగ్గా రాడు, వచ్చినా చదువు చెప్పక మా పిల్లల జీవితాలు ఆగం అవుతున్నాయని,అక్కడి గిరిజనులు ఎన్నోమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోక పొగా అతన్ని కూడా కాపాడారని చెప్పారు.
బోటిమీది తండాలో పని చేయడం ఇష్టంలేని సవితారెడ్డి అనే ఉపాధ్యాయురాలిచే బడిని మూపిచ్చి,ఆమెకు అనుకూలంగా ఉన్న పక్క మండలానికి నిబంధనలకు విరుద్ధంగా సర్దుబాటు చేశారన్నారు.
కడేలబావితండా,పార్లగడ్డ తండా,డాకూతండా,కొర్ర తండాల్లో ఉపాధ్యాయులు విధుల పట్ల నిర్లక్ష్యం చేస్తున్నారని అక్కడి గిరిజన సంఘాలు ఫిర్యాదు చేసినా పట్టించుకోక,వారిని కాపాడుతూ గిరిజన తండాల్లోని పిల్లలు ప్రైవేట్ పాఠశాలలకు వెళ్ళేటట్లు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రజా సంఘాల నాయకులుగా మేము క్షేత్ర స్థాయి పర్యటన చేసిన సందర్భంలో జిల్లాలోని పలు మండలాల్లో ఇదే పరిస్థితులున్నాయన్నారు.ఇప్పటికైనా ఇలాంటి అధికారులను సస్పెండ్ చేయాలని,లేనిపక్షంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టి,రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళతామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం కార్యదర్శి గిరగాని భిక్షపతి గౌడ్,బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు ఎర్ర శ్రీహరి గౌడ్,బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు గౌని రాజేష్ తదితరులు పాల్గొన్నారు.