ఒకే ఒక్కడు తెలంగాణలో ముగ్గురు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను తెగ టెన్షన్ పెట్టేస్తున్నాడు.ఆయన తమ పార్టీలో చేరితే ఎక్కడ తమ సీటుకు ఎర్త్ పెడతాడో ? అన్న బెంగ వారిలో చాలా స్ట్రాంగ్గా ఉందట.దీంతో ఆయన టీఆర్ఎస్ ఎంట్రీని వారు అడ్డుకోలేక ? తాము ఏం చేయలేక లోలోన తెగ బాధపడిపోతున్నారట.తెలంగాణలోని ఉత్తర తెలంగాణలో పూర్వ ఆదిలాబాద్ జిల్లాలో మాజీ ఎంపీ రమేష్ రాథోడ్కు ఎంతో ఫాలోయింగ్ ఉంది.
రమేష్ రాథోడ్ ఆదిలాబాద్ ఎంపీగా పనిచేస్తే, అదే టైంలో ఆయన భార్య సుమన్ రాథోడ్ ఖనాపూర్ నుంచి వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.ఇదిలా ఉంటే ఆయన టీడీపీకి గుడ్ బై చెప్పి టీఆర్ఎస్లో చేరేందుకు రంగం సిద్ధమైంది.
రోడ్లు, భవనాల శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చొరవతో రాథోడ్ ఫ్యామిలీ అంతా టీఆర్ఎస్లో చేరిపోనుంది.ఆయనకు కేసీఆర్ స్పష్టమైన హామీ కూడా ఇచ్చారట.
ఆదిలాబాద్ – నిర్మల్ – కుమ్రం భీం జిల్లాలో రమేష్కు ఉన్న ఫాలోయింగ్ను గుర్తించిన కేసీఆర్ ఆయన కోరుకున్న సీటు ఇవ్వనున్నారని టాక్.దీంతో ఇప్పుడు రాథోడ్ టీఆర్ఎస్ ఎంట్రీ ఈ మూడు జిల్లాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేల గుండెల్లో రైళ్లు పరిగెట్టేలా చేస్తోంది.
రమేష్ రాథోడ్ సొంత నియోజకవర్గం ఖానాపూర్ అడిగితే అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖా నాయక్కు షాక్ తప్పదు.ఒక వేళ ఆయన ఎంపీ సీటు కోరితే ఎంపీ నగేశ్ బోథ్ అసెంబ్లీ సీటుకు మారాల్సి ఉంటుంది.
నగేశ్ బోథ్కు వెళితే అక్కడ ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే బాపూరావుకు షాక్ తప్పదు.లేదా రమేష్ రాథోడ్ ఆసిఫాబాద్ నుంచి బరిలో ఉంటే అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే కోవ లక్ష్మిని తప్పించాలి.
ఏదేమైనా రమేష్ రాథోడ్ టీఆర్ఎస్ ఎంట్రీ రేఖా నాయక్ – నగేశ్ – బాపూరావు – కోవ లక్ష్మిలలో ఎవరికి ఎర్త్ పెడుతుందో చూడాలి.