టెంపా: December:3 భాషే రమ్యం.సేవే గమ్యం అని నినదించే ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) దానికి తగ్గట్టుగానే అడుగులు వేస్తోంది.
తొలిసారిగా టెంపాలో అష్టావధానాన్ని నిర్వహించి చరిత్ర సృష్టించింది.శతావధానిచే అవధానం అనే శీర్షికతో ఈ మహత్తర కార్యక్రమం జరిగింది.
శ్రీ అయ్యప్పస్వామి ఆలయ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమానికి శతావధాని, అవధాన సుధాకర, అవధాన భారతీ, అవధాన భీమ.డాక్టర్ రాంభట్ల పార్వతీశ్వర శర్మ అష్టావధానం చేశారు.
స్థానిక ప్రముఖులు, తెలుగు భాషా ప్రేమికులు ఈ కార్యక్రమానికి విచ్చేశారు.ఎనిమిది విభిన్న అంశాలతో కూడిన ఈ అష్టావధానాన్ని నిర్వర్తించటానికి ఎనిమిది పృచ్ఛకులు పాల్గొన్నారు.
సమస్య: భాస్కర్ సోమంచి , దత్తపది: శ్రీమతి శారద మంగిపూడి, వర్ణన: డా.వెంకట శ్రీనివాస్ పులి, నిషిద్ధాక్షరి: శ్రీ బ్రహ్మానంద శర్మ మొదిలి,
న్యస్తాక్షరి: శ్రీ మూర్తి మధిర ఛందోభాషణం: శ్రీ రామకృష్ణ ఉడుత, అప్రస్తుత ప్రసంగం: ఆచార్య శివకుమార్ పంగులూరి , ఆశువు: శ్రీ రాఘవేంద్ర ద్రోణంరాజు, చి.రిషిత్ వడ్లమాని, శ్రీమతి శిరీష దొడ్డపనేని, ఆచార్య సుబ్బారావు దూర్వాసుల తదితరులు అవధానాన్ని ఆసక్తికరంగా రక్తికట్టించడంలో తోడ్పాడ్డారు.అవధాని ఆచార్య రాంభట్ల పార్వతీశ్వర శర్మ తెలుగు రాష్ట్రాల్లో 55 అవధానాలు చెయ్యగా, ప్రస్తుతం జరుగుతున్న ఉత్తర అమెరికా పర్యటనలో తన అవధాన షష్టిపూర్తి చేసుకుని, టాంపాలో తన 62వ అవధానం అద్భుతంగా చేయడం జరిగింది.
అమెరికా పర్యటనలో ఇంతవరకు అవధానిగారికి అవధాన కిశోర (TANTEX), అసమాన ధారణా ధురీణ (60వ అవధానంలో), నవయువావధాని (అట్లాంటాలో) బిరుదులు ఇవ్వడం జరిగింది.ప్రేక్షకులకు ఉత్సాహంతో పాటు, ఉత్కంఠాన్ని, ఆశ్చర్యాన్ని కలిగించేలా ఈ అష్టావధానాన్ని నిర్వర్తించటానికి మధిర మూర్తి , డా.శివ కుమార్ పంగులూరి చక్కటి ప్రణాళికను కూర్చగా NATS టెంపా సభ్యులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
నాట్స్ టెంపా సమన్వయ కర్త రాజేశ్ కాండ్రు సమన్వయంతో ఏర్పాటైన ఈ అవధాన కార్యక్రమం ఆద్యంతం తెలుగు భాషా మాధుర్యాన్ని పంచింది.నాట్స్ కు భాష, సేవ రెండు రెండు కళ్లలాంటివని ఈ సందర్భంగా నాట్స్ ఛైర్మన్ శ్రీనివాస్ గుత్తికొండ గుర్తు చేశారు.
మూర్తి మధిర,నాట్స్బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ శ్రీ ప్రశాంత్ పిన్నమనేని సుధీర్ మిక్కిలినేని, శ్రీనివాస్ మల్లాది, శ్రీనివాస్ అచ్చి, జగధీశ్ తౌటం, ప్రసాద్ ఆరికట్ల, శ్రీధర్ గౌరవెల్లి, సురేష్ బొజ్జ, శిరీషా దొడ్డపనేని,సుధా బిందు బండ… తదితరుల సమక్షంలో అవధాని ఆచార్య రాంభట్ల పార్వతీశ్వర శర్మకి సన్మాన సత్కారాలు నిర్వర్తించారు.
అయ్యప్ప స్వామి ఆలయ వైస్ ప్రెసిడెంట్ రమా కామిశెట్టి , జాయింట్ ట్రెజరర్ రాజా పంపాటి , డా.శర్మ కు సన్మానం చెయ్యటంతో ఈ కార్యక్రమం ముగిసింది.పద్మజ అన్నంరాజు, దీప పంగులూరి, భావన వడ్లమాని, సంధ్య కాండ్రులు చక్కటి తేనీటి విందు ఏర్పాటు చేశారు.