తెలంగాణలో మళ్లీ ఎన్నికల సందడి మొదలైంది.ఇప్పటికే అసెంబ్లీ, పార్లమెంట్, స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటి తిరుగులేని శక్తిగా ఉన్న టిఆర్ఎస్ పార్టీ ప్రత్యర్థి పార్టీలకు అవకాశం ఇవ్వకుండా మరోసారి తన గెలుపు జోరు కొనసాగించడానికి జోరు సిద్ధమైపోయింది.
విపక్షాలకు చేరుకొనే అవకాశం ఇవ్వకుండా జనవరిలోనే మునిసిపల్ ఎన్నికలకు రంగం సిద్ధం చేసింది.ఇప్పటికే డిసెంబర్ ఆఖరు అయిపోతూ ఉండగా.
కేవలం నెల రోజులు వ్యవధి మాత్రమే ఎన్నికలకి ఉంది.తాజాగా ఎన్నికల సంఘం తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకి సంబందించిన నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఎలాంటి హడావిడి లేకుండా ఉన్నపళంగా ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడం టీఆర్ఎస్ వ్యూహంలో భాగంగానే జరిగిందనే మాట ఇప్పుడు వినిపిస్తుంది.విపక్షాలైన కాంగ్రెస్, బీజేపీ ఇంకా మున్సిపల్ ఎన్నికలకి ఎలాంటి కార్యాచరణ కూడా సిద్ధం చేసుకోలేదు.
అయితే ఎన్నికల షెడ్యూల్ను రాష్ట్ర ఎన్నికల సంఘం తాజాగా ప్రకటించి అందరికి షాక్ ఇచ్చింది.జనవరి 7న పురపాలక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది.ఈనెల 30న ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల చేయనున్నారు.డిసెంబర్ 31 నుంచి జనవరి 2 వరకు అభ్యంతరాలను స్వీకరించనున్నారు.
డిసెంబర్ 31వ తేదీన జిల్లా అధికారులతో రాజకీయ పార్టీల సమావేశం నిర్వహిస్తారు.జనవరి 1న మున్సిపల్ కమిషనర్లతో ఈసీ భేటీ అవుతుంది.
జనవరి 3న అభ్యంతరాలకు పరిష్కారం ఉంటుంది.జనవరి 4న ఓటర్ల తుది జాబితా విడుదల చేస్తారు.
జనవరి 10 నామినేషన్లకి చివరి తేదీ.జనవరి 11న నామినేషన్ల పరిశీలన, జనవరి 14న నామినేషన్ల ఉపసంహరణ, జనవరి 22 పోలింగ్, జనవరి 25న ఫలితాలు విడుదల చేయనున్నారు.
మొత్తానికి పురపాలన ఎన్నికలు జనవరి ఆఖరు నాటికి ముగిసిపోనున్నాయి.