గత దశాబ్ద కాలంగా సోషల్ మీడియా మెల్ల మెల్లగా పెరుగుతూ వస్తోంది.ఒకప్పటి పరిస్థితికి ఇప్పటి పరిస్థితికి చాలా మార్పు వచ్చింది.
ఆండ్రాయిడ్ ఫోన్లు, 4జీ నెట్వర్క్లు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్లు ఉంటున్నాయి.అందులో సోషల్ మీడియా యాప్లు కుప్పలు తెప్పలుగా ఉంటున్నాయి.
ఒకప్పుడు ఆర్కుట్, ఆ తర్వాత ఫేస్బుక్, వాట్సప్ ఇప్పుడు టిక్ టాక్ ఒక్కో సమయంలో ఒక్కో సోషల్ మీడియా పోర్టల్ సందడి చేస్తోంది.ప్రస్తుతం ప్రపంచం మొత్తం కూడా టిక్ టాక్ అంటూ ఊగిపోతుంది.
కొన్ని కోట్లమంది టిక్టాక్ను డౌన్లోడ్ చేసుకున్నారు.కేవలం ఇండియాలోనే 20 కోట్ల మంది టిక్ టాక్ను డౌన్లోడ్ చేసినట్లుగా విశ్లేషకులు చెబుతున్నారు.
టిక్ టాక్లో ఏదైనా సౌండ్కు మనం డాన్స్ లేదా అనుకరించడం అన్నమాట.ఒకప్పుడు వచ్చిన డబ్స్మాష్కు ఇది కాస్త అప్డేటెడ్ వర్షన్.తమలో ఉన్న కళను జనాలు చూపించేందుకు టిక్ టాక్ను వినియోగించడం మొదలు పెట్టారు.పెద్ద ఎత్తున టిక్ టాక్ను వాడుతున్న జనాలు తమ పనిని కూడా మర్చి పోతున్నారు.
కొందరు టిక్ టాక్ వీడియోలు చేసేందుకు సాహసాలు చేస్తుంటే మరి కొందరు మాత్రం టిక్ టాక్ వీడియోలను చూసేందుకు చాలా సమయం కేటాయిస్తున్నారు.టిక్ టాక్ వీడియోల లైక్స్ కోసం కొందరు చేస్తున్న ప్రయత్నాలు మరీ దారుణం.
ఈ పరిస్థితుల నేపథ్యంలో తమిళనాడు అసెంబ్లీలో టిక్టాక్ నిషేదంపై చర్చ జరిగింది.ఎమ్మెల్యే తమీమున్ హన్సారీ రాష్ట్రంలో టిక్టాక్ వినయోగదారుల సంఖ్య బాగా పెరిగిందని, అందులో అసభ్యకరంగా పోస్ట్లు పెడుతూ కొన్ని వర్గాల వారిని అవమానించేలా చేస్తున్నారని, హింసకు ప్రేరేపించే విధంగా కూడా టిక్ టాక్ వినియోగం ఉంటుందంటూ హన్సారీ అసెంబ్లీలో ప్రస్థావించాడు.
టిక్టాక్ను వెంటనే నిషేదించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని కోరాడు.హన్సారీ ప్రశ్నకు తమిళనాడు సమాచార శాఖ మంత్రి స్పందిస్తూ తప్పకుండా టిక్ టాక్ను నిషేదిస్తాం, అందుకు కేంద్రంపై కూడా ఒత్తిడి తీసుకు వస్తామని హామీ ఇచ్చారు.
తమిళనాడు అసెంబ్లీలో జరిగిన ఈ పరిణామంపై తమిళ జనాలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.తమలో ఉన్న కళను టిక్ టాక్ ద్వారా చూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు.ఎవరో ఒకరు ఇద్దరు ఏదో చేశారని, లక్షలాది మంది వినోదాన్ని ప్రభుత్వం ఎలా తొక్కేసే ప్రయత్నం చేస్తుంది అంటూ జనాలు ప్రశ్నిస్తున్నారు.అయితే టిక్ టాక్ను నిషేదించడం అనేది తమిళనాడు ప్రభుత్వం వల్ల అయ్యే పని కాదని, కేంద్రం చొరవ తీసుకుంటేనే ఆ పని అవుతుందనేది కొందరి మాట.