వాషింగ్టన్ లో తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సమావేశాలకు అతిరథమహారధులందరిని పిలిచారు.ఈ సమావేశంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో సహా ఎన్నో రాజకీయ పార్టీలకు చెందిన నాయకులూ హాజరయ్యారు.
ఈ సందర్భంగా తానా ప్రతినిధులు ఎన్నో కార్యక్రమాలను ఏర్పాటు చేశారు.ఈ సభలు కూడా బాగా హైలెట్ అవుతున్నాయి.
ఇంతవరకు బాగానే ఉన్నా ఈ సభల్లో రాజకీయ అంశాలు కొన్ని వివాదాస్పదం అవ్వడం చర్చనీయంశంగా మారింది.ముఖ్యంగా బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్మాధవ్కు అవమానం ఎదురయ్యింది.
అయితే కేవలం బీజేపీనే టార్గెట్ గా చేసుకుని కొంతమంది నిరసనలు తెలపడం అంతకు ముందు రామ్ మాధవ్ కు సరైన ప్రాధాన్యమే దక్కడం ఇక్కడ ప్రధానంగా గుర్తించాల్సిన అంశంగా కనిపిస్తోంది.
బీజేపీ పార్టీలో రామ్ మాధవ్ పాత్ర గురించి చెప్పుకోవాలంటే ఆయన ఆ పార్టీలో అగ్రనేతగానే గుర్తింపు తెచ్చుకున్నారు.ప్రస్తుతం ఏపీ, తెలంగాణల్లో బీజేపీ బలపడడానికి నాయకుల వలసలు పెరగడానికి ఆయనే ప్రధానపాత్ర పోషిస్తున్నారు.దీనికి తగ్గట్లుగానే ఆయనకు తానా సభల్లో ప్రవాసాంధ్రులు గౌరవం ఇచ్చారు.
ఉన్నత స్థితికి ఎదుగుతున్న తెలుగువాడిగా పొగడ్తలతో ముంచెత్తారు.ఇంతవరకు బాగానే ఉన్నా రామ్ మాధవ్ ఎప్పుడైతే మోదీ గురించి పొగడ్తల వర్షం కురిపించారో అప్పుడే సభలో నిరసన సెగలు చెలరేగాయి.
అయినా రామ్ మాధవ్ మోదీ భజనను ఆపకుండా కొనసాగిస్తూ వెళ్లడంతో ఆ నిరసనలు తీవ్రం అయ్యాయి.ఇదే సమావేశాల్లో అనేక పార్టీలకు చెందిన నాయకులు ప్రసంగించిన ఎక్కడా ఇటువంటి అలజడి జరగకపోవడం గమనార్హం.
ఎందుకంటే ఈ సమావేశాల్లో ప్రసంగించిన వారంతా రాజకీయాలకు అతీతంగా మాట్లాడారు.తెలుగు ప్రజల ఐక్యత గురించి మాత్రమే చెప్పుకొచ్చారు.సొంత రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందామని , కలిసికట్టుగా ముందుకు వెళదామని చెప్పుకొచ్చారు.అయితే దీనికి భిన్నంగా రామ్ మాధవ్ మోదీ భజన చేయడం నచ్చక సభికుల్లో ఎక్కువమంది నిరసన తెలియజేసారు.
ఏపీకి మోదీ ఎంతో చేశారని చెప్పడం ప్రవాసాంధ్రులను మరింత ఆగ్రహానికి గురి చేసింది.అందుకే రామ్ మాధవ్ కు ఇలా చేదు అనుభవం ఎదురయ్యినట్టు అర్ధం అవుతోంది.