మహారాష్ట్ర సంక్షోభం ఆఖరి ఘట్టానికి చేరుకుంటోంది.అసెంబ్లీలో బలపరీక్ష జరపాలని గవర్నర్ ఆదేశించారు.
ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వం బలాన్ని నిరూపించుకోవాలన్నారు.అయితే గవర్నర్ ఆదేశాలను శివసేన సుప్రీం కోర్టులో సవాల్ చేసింది.24 గంటల వ్యవధిలో బలపరీక్ష అంటే ఎలా అని శివసేన ప్రశ్నిస్తోంది.గవర్నర్ ఆదేశాలపై స్టే ఇవ్వాలని సుప్రీం కోర్టును శివసేన లాయర్ కోరారు.
ఈ సందర్భంగా శివసేన లాయర్ కు, సుప్రీం ధర్మాసనానికి తీవ్ర స్థాయిలో వాదోపవాదాలు జరిగాయి.బలా బలాల్ని తేల్చుకునే అవకాశం అసెంబ్లీకే వదిలేద్దామని సుప్రీం కోర్టు తేల్చేసింది.16 మంది అనర్హతపై తీర్పు రానున్న జులై 11వ వరకు బలపరీక్ష ఆపితే నష్టం ఏంటని కూడా శివసేన లాయర్ అడిగారు.అదేవిధంగా షిండే వర్గాన్ని ఓటింగ్ నుంచి మినహాయించాలని కోరారు.
అనర్హతకు, ఓటింగ్ కు సంబంధం ఏంటని ధర్మాసనం ప్రశ్నించింది.
ప్రభుత్వం తన బలాన్ని నిరూపించుకోవాల్సిందిగా ఆదేశించాలంటూ తిరుగుబాటు వర్గం నేత షిండే మంగళవారం గవర్నర్ కు లేఖ రాసారు.
అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత దేవంద్ర ఫడ్నవీస్ కూడా గత రాత్రి గవర్నర్ ను రాజ్ భవన్ లో కలుసుకున్నారు.ఉద్దవ్ థాక్రే ప్రభుత్వాన్ని బలం నిరూపించుకోవాలని ఆదేశించాల్సిందిగా ఆయన కూడా కోరారు.
ఈ నేపథ్యంలో గురువారం ఉదయం 11 గంటలకు అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని అసెంబ్లీ కార్యదర్శిని గవర్నర్ ఆదేశించారు.ఈ మేరకు సెక్రటరీ శాసనసభ్యులందరికీ గురువారం ఉదయం ప్రత్యేక సెషన్ గురించి లేఖలు రాసారు.
అందరూ జరిగే అసెంబ్లీ ప్రత్యేక సమావేశానికి హాజరు కావాలని సూచించారు.
ఇదిలా ఉంటే గవర్నర్ భగత్ సింగ్ కోష్యారి ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రేకు ఒక లేఖ రాసారు.ప్రభుత్వం మైనారిటీలో పడిందని ఆయనకు తెలిపారు.అధికార పార్టీ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయడం వల్ల ప్రభుత్వానికి బలం తగ్గిపోయిందన్నారు.
అసెంబ్లీలో బలం నిరూపణ చేయాలని ప్రతి పక్ష నేతల నుంచి తనకు రెండు లేఖలు అందినట్లు గవర్నర్ అందులో వివరించారు.పది మంది ఇండిపెండెంట్లు కూడా లేఖ రాసినట్లు తెలిపారు.
శివసేన ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించిన ఎమ్మెల్యేలను ముఖ్యమంత్రి బెదిరిస్తున్నట్లు ఫిర్యాదు వచ్చిందని గవర్నర్ రాసిన లేఖలో ప్రస్తావించారు.