ఎన్నో సంచలనాలకు నిలయంగా 18 సంవత్సరాల నుంచి పార్టీని అలుపెరగకుండా శ్రమిస్తూ ముందుకు నడిపిస్తూ వస్తున్న టిఆర్ఎస్ పార్టీ అధినేత కెసిఆర్ ఇప్పుడు పార్టీలో పెను మార్పులకు శ్రీకారం చుట్టే దిశగా అడుగులు వేస్తున్నట్టు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.వచ్చే ఏడాది ఉగాదిలోగా తన కుమారుడు కేటీఆర్ ను ముఖ్యమంత్రిగా నియమించడంతో పాటు తన కుమార్తె కవితకు టీఆర్ఎస్ పార్టీ పగ్గాలు అప్పగించి తాను ఢిల్లీ రాజకీయాల్లో చక్రం తిప్పాలని కెసిఆర్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం కేంద్రంలో తమకు ఎదురు లేదు అన్నట్టుగా అన్ని రాష్ట్రాలను శాసించేందుకు ప్రయత్నిస్తున్న బిజెపి ఇప్పుడు ఒక్కో రాష్ట్రంలో తమ ప్రాబల్యాన్ని కోల్పోతూ వస్తోంది.ఈ నేపథ్యంలో బీజేపీకి శత్రువులుగా ఉన్న ప్రాంతీయ పార్టీలన్నిటినీ దగ్గరకు చేర్చుకుని ఆ లోటును పూడ్చుకోవాలని చూస్తోంది.
ఈ క్రమంలోనే టిఆర్ఎస్ ను దగ్గర చేసుకోవాలని ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు గా సమాచారం.
తాజాగా బిజెపి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్ ఆర్ సి, ఎన్ పి ఆర్ లు బిజెపి ఇమేజ్ ను డ్యామేజ్ చేసినట్లుగా జార్కండ్ ఎన్నికల ఫలితాలు నిరూపించాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.ఈ పరిణామాల నేపథ్యంలో అటు కాంగ్రెస్ పార్టీ, ఇటు ప్రాంతీయ పార్టీలలో కొత్త ఆశలు మొదలయ్యాయి.2024 ఎన్నికల సమయానికి ఏదో ఒక రకంగా బలపడాలని చూస్తున్నాయి.ఇటువంటి పరిస్థితుల్లో బిజెపి ప్రాంతీయ పార్టీలను దగ్గర చేసుకునే పనులు పడింది.దీనిలో భాగంగానే టిఆర్ఎస్ ను కూడా సంప్రదించినట్టు గా ప్రచారం జరుగుతోంది.తెలంగాణ బిజెపి నాయకులకు కూడా ఈ విషయంపై అధిష్టానం నుంచి స్పష్టమైన క్లారిటీ వచ్చినట్టుగా తెలుస్తోంది.అనవసరంగా టిఆర్ఎస్ ను విమర్శించ వద్దు అంటూ బీజేపీ చీఫ్ అమిత్ షా సూచించినట్టు సమాచారం.
అలాగే టిఆర్ఎస్ పార్టీని ఎన్డీయేలో చేరాల్సిందిగా కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ చీఫ్ అమిత్ షా ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది.ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రిగా కేటీఆర్ కు అవకాశం ఇచ్చి మీరు ఢిల్లీకి రావాల్సిందిగా అమిత్ షా కెసిఆర్ ను కోరినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.అందుకే కేటీఆర్ కు ముఖ్యమంత్రి పీఠం కట్టబెట్టి పార్టీ పగ్గాలను తన కుమార్తె కవితకు ఇచ్చి సమతూకం పాటించాలని కేసీఆర్ చూస్తున్నారట.సుదీర్ఘ కాలం రాజకీయాల్లో మునిగితేలుతున్న కెసిఆర్ ఇకపై రాజకీయాలకు దూరంగా ఫామ్ హౌస్ లో విశ్రాంతి తీసుకుంటారు అంటూ మరో ప్రచారం జరుగుతోంది.
అయితే ఇందులో నిజం ఉన్నా లేకపోయినా కేటీఆర్, కవితకు మాత్రం రెండు పదవులు అతి తొందరలోనే దక్క పోతున్నట్టుగా టిఆర్ఎస్ పార్టీ లోని కొంతమంది కీలక నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు.అయితే కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో బిజీ అవుతారా లేక విశ్రాంతి తీసుకుంటారా అనే విషయం తేలాలంటే ఉగాది వరకు ఆగాల్సిందే.