వైజాగ్ గ్యాస్ లీక్ ఘటన నుంచి ఏపీ ప్రజలు బయట పడలేకపోతున్నారు.ఆ ప్రమాదంలో ఏకంగా 14 మంది ప్రాణాలు పోగొట్టుకోగా, వందల మంది క్షతగాత్రులు అయ్యారు.
కంపెనీ నిర్లక్ష్యం కారణంగా గ్యాస్ లీకై సమీపంలో ఉన్న గ్రామాలని ఉక్కిరిబిక్కిరి చేసింది.అర్ధరాత్రి చెట్టుకొకరు, పుట్టకొకరు అన్నట్లు జనాలు పరుగులు తీసారు.
కొంత మంది ఊపిరి ఆడక పిట్టల్లా ఎక్కడికక్కడే పారిపోయారు.ఈ ప్రమాద ఘటన అంతర్జాతీయంగా చర్చనీయాంశం అయ్యింది.
ఈ ఘటన తర్వాత రాష్ట్రంలో ఎక్కడ విష వాయువులు లీక్ అయిన ప్రజలు భయంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పరుగులు తీస్తున్నారు.ఆ విష వాయువుల కారణంగా ఎక్కడ ప్రమాదానికి గురవుతామో అని భయభ్రాంతులకి గురవుతున్నారు.
తాజాగా కాకినాడ ఆటో నగర్ శివారులో కూడా విషవాయువుల కారణంగా దుర్గంధం/em> వెదజల్లడంతో జనం భయంతో పరుగులు తీశారు.
ఆటోనగర్ శివారులో రాత్రి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రసాయిన వ్యర్దాలతో నిండిన పది డ్రమ్ములని తీసుకొచ్చి రోడ్డు మీద వదిలేశారు.
ఆ రసాయిన వ్యర్ధాల నుంచి విష వాయువులు చుట్టూ పరిసరాలలో వ్యాపించాయి.విషవాయువుల కారణంగా తీవ్ర దుర్గంధం వెలువడడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు.అప్పటికే విషయం చుట్టుపక్కల తెలియడంతో స్థానికులు అక్కడి నుంచి పరుగులు తీశారు.అటుగా వెళ్ళిన కొందరు లారీ డ్రైవర్లు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, పరిశ్రమలశాఖ అధికారులు నమూనాలు సేకరించి పరీక్షల కోసం ప్రయోగశాలకు పంపించారు.కాగా, లీకైన వాయువును ప్రాథమికంగా ప్రమాదకరమైన అమోనియాగా గుర్తించారు.
రెండు అగ్నిమాపక శకటాలతో వాయువులపై నీళ్లు చల్లడంతో వాయువు గాఢత తగ్గింది.దీంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.
అయితే ఆ ప్రమాదకర అమోనియా రసాయినాలని రోడ్డుపై వదిలేసిన వారు ఎవరనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.