శ్రీవారికి అత్యంత ప్రీతిపాత్రమైన మాసాలలో ధనుర్మాసం కూడా ఒకటి.ఈ ధనుర్మాసంలో తిరుమల శ్రీవారి ఆలయంలో నిత్యం శ్రీవారికి అందే సేవలకు బదులుగా ప్రత్యేకమైన పూజలు, నైవేద్యాలు సమర్పిస్తారు.
ఈ ఒక్క నెల మాత్రం శ్రీవారికి ప్రత్యేకం అనే చెప్పాలి.ఈ నెల 17 వ తేది అంటే గురువారం మధ్యాహ్నం నుంచి ధనుర్మాస గడియలు ప్రారంభం అయ్యి మళ్ళీ 2022 జనవరి 14వ తేదీ వరకు ధనుర్మాస ప్రత్యేక పూజలను అర్చకులు నిర్వహిస్తారు.
మరి ఈ ధనుర్మాసంలో స్వామి వారికి నిర్వహించే ప్రత్యేక పూజలు ఏంటో తెలుసుకుందామా.ప్రతి రోజు స్వామి వారిని సుప్రభాత సేవతో మేల్కొలుపుతారు కదా.కానీ ఈ ధనుర్మాసంలో మాత్రం సుప్రభాత సేవకు బదులుగా తిరుప్పావై పఠనం చేసి శ్రీవారిని మేల్కొలుపుతారు ఆలయ అర్చకులు.
ఎందుకంటే ఈ ధనుర్మాసంలోనే గోదాదేవి శ్రీవారిని తన భర్తగా భావించి అత్యంత భక్తి శ్రద్దలతో శ్రీవారి పూజలు నిర్వహించి ముప్పై పాసురాలను రచించింది.
వాటినే గోదాదేవి పాసురాలు అంటారు.అందుకే ఈ ధనుర్మాసంలో సుప్రభాత సేవకు బదులుగా గోదాదేవి రచించిన ఒక్కో పాసురాని ఒక్కో రోజు పటిస్తూ ఉంటారు అర్చకులు.అలా ముప్పై రోజుల పాటు ముప్పై పాసురాలను పటిస్తూ శ్రీవారిని మేల్కొలుపడం అనేది ఎప్పటినుంచో వస్తున్న ఆచారం.తిరిగి జనవరి 15వ తేదీన సుప్రభాత సేవను పునరుదరిస్తారు.
అంతేకాకుండా శ్రీవారికి చేసే సహస్రనామార్చనలో ఉపయోగించే తులసి దళాలకు బదులుగా ధనుర్మాసంలో బిల్వపాత్రలతో నిర్వహిస్తారు.

అలాగే శ్రీవారికి చేసే ఏకాంత సేవను కూడా భోగ శ్రీనివాసునికి చేయకుండా శ్రీకృష్ణ భగవానుడికి నిర్వహిస్తారు.అలాగే ఈ ధనుర్మాసంలో స్వామి వారికీ ప్రత్యేక నైవేధ్యాలను నివేదిస్తారు ఆలయ అర్చకులు.శ్రీవారికి ప్రతి రోజు ఉదయం, సాయంత్రం దోసెలు నైవేద్యంగా సమర్పిస్తారు.
కానీ ఈ ధనుర్మాసంలో మాత్రం దోసెలకు బదులుగా బెల్లం పాకంలో ఉంచిన ప్రత్యేక దోసెలని శ్రీవారికి నివేదిస్తారు అర్చకులు.ఇలా నెల రోజుల పాటు శ్రీవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
కాగా ఈనెల 17 వ తేది నుంచి జనవరి 14వ తేదీ వరకు సుప్రభాత సేవను టీటీడీ రద్దు చేస్తున్నట్లు తెలిపింది.కోవిడ్ ను దృష్టిలో పెట్టుకుని శుక్రవారం నుంచి స్వామివారికి జరగనున్న తిరుప్పావైను ఏకాంతంగా బంగారు వాకిలి వద్ద పాటించనున్నారు వేదపండితులు.