అడవి జంతువులు జనసంచారంలో ప్రవేశించి వీరంగం సృష్టించడం తరచూ చూస్తునే ఉంటాం.ఏనుగులు, పులులు, పాములు, ఎలుగు బంట్లు ఇలా కొన్ని జంతువులు రద్దీ ప్రాంతాల్లోకి వచ్చి ప్రజలను భయాందోళనకు గురి చేస్తుంటాయి.
క్రూర మృగాలు అటవీ ప్రాంతాల్లో పర్యటిస్తూ మేకలు, దూడలు, ఆవులను చంపిన ఘటనలు, మనుషులపై దాడి చేసిన ఘటనలు చాలానే చోటు చేసుకున్నాయి.
అయితే ఓ ఎలుగుబంటి కూడా బహిరంగ ప్రదేశాల్లో పర్యటిస్తూ ప్రజలను ముప్పు తిప్పలు పెట్టించింది.
ఒడిషా రాష్ట్రం కలహండి జిల్లాలోని భవనిపట్నా ప్రాంతంలో ఓ ఎలుగు బంటి బీభత్సం సృష్టించింది.రోడ్లపై కనిపించిన వారిపై దాడికి దిగింది.అడవి నుంచి మనుషుల మధ్య వచ్చిన ఆ ఎలుగుబంటి భయంతో పరుగులు తీస్తు అడ్డొచ్చిన వారిపై దాడి చేయసాగింది.దీంతో స్థానికులు రాళ్లు, కట్టెలు పట్టుకుని ఎలుగుబంటిని వెంబడించసాగారు.
రాళ్లతో కొడుతుండటంతో కోపంలో ఆ ఎలుగుబంటి పలువురిపై విరుచుకు పడింది.ఈ మేరకు కొందరికి గాయాలయ్యాయి.
అయితే, ఎలుగుబంటి బయట తిరుగుతుందని స్థానికులు అటవీశాఖ అధికారులకు ఫిర్యాదు చేయడంతో అక్కడి జిల్లా అటవీశాఖ అధికారి నితిష్ కుమార్ ఘటనా స్థలానికి చేరుకున్నాడు.సిబ్బంది సహకారంతో అతి కష్టం మీద ఎలుగుబంటికి వల వేసి పట్టుకున్నారు.
అనంతరం వ్యాన్ లో తరలించి అడవిలో వదిలేశారు.ఈ మేరకు జిల్లా అటవీశాఖ అధికారి నితిష్ కుమార్ మాట్లాడుతూ.
ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, అడవి జంతువులు కొన్ని సార్లు దారి తప్పి ఇలా జన సంచారంలోకి వస్తాయన్నారు.జనసందడిని చూసి అవి భయానికి గురవుతాయన్నారు.
దీని వల్ల అవి దాడికి దిగడం లాంటివి చేస్తాయన్నారు.అడవి జంతువులు కనిపిస్తే ఫారెస్ట్ అధికారులను సంప్రదించాలని ఆయన కోరారు.