ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అనేక ఇబ్బందులను ఎదుర్కొంటోంది.వరుసగా ఎదురవుతున్న ఓటములు టీడీపీని మరిన్ని కష్టాల్లోకి తీసుకువెళుతోంది.2019 సార్వత్రిక ఎన్నికల్లో ఎదురైన ఓటమి నుంచి ఎప్పటికీ పార్టీకి కోలుకోలేకపోతుంది. స్థానిక సంస్థలు , మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయింది.
అదీ కాకుండా తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న కుప్పం నియోజకవర్గంలోని కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలవడం, చంద్రబాబు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు.ఈ నేపథ్యంలోనే కుప్పం మున్సిపల్ ఎన్నికల పై సమీక్ష నిర్వహించిన చంద్రబాబు ఈ సందర్భంగా కీలక విషయాలను ప్రస్తావించారు.
పార్టీని సమూలంగా ప్రక్షాళన చేయబోతున్నామని , కుప్పం నియోజకవర్గం నుంచి ఈ ప్రక్షాళన ప్రారంభిస్తాం అంటూ చంద్రబాబు ప్రకటించారు.పార్టీలోనే ఉంటూ పార్టీకి వెన్నుపోటు పొడుస్తున్న నాయకులను గుర్తించే పనిలో ఉన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి ఉండడంతో పెద్ద ఎత్తున ప్రక్షాళన చేసి, కోవర్టులను గుర్తించి, వారిని పార్టీ నుంచి సాగనంపే ప్రక్రియ మొదలు పెట్టాలనే నిర్ణయానికి వచ్చారు.అయితే పార్టీలోని కోవర్టులు, పార్టీలోనే ఉంటూ పార్టీ కి నష్టాన్ని చేకూరుస్తూ, అధికార పార్టీతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్న నేతలు ఎవరు అనే విషయం చంద్రబాబుకు తెలియంది కాదు.
అయితే వారు పార్టీ సీనియర్లు కావడం, గతంలో పార్టీలో కీలకంగా పని చేయడం, వీటన్నిటినీ పరిగణలోకి తీసుకుని బాబు సీరియస్ యాక్షన్ తీసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారట.
వాస్తవంగా చూసుకుంటే మొదటి నుంచి పార్టీకి చేటు చేస్తున్న వారి విషయంలో బాబు ఉదాసీన వైఖరితోనే వ్యవహరిస్తూ వస్తున్నారు.పార్టీకి నష్టం చేకుర్చుతూ వచ్చిన వారికీ ఎన్నో పదవులు అప్పగించారు.వారే మారుతారు లే అన్న ఉదాసీన వైఖరితో ఉండడం వల్లే ఇప్పుడు పార్టీకి డ్యామేజ్ చేస్తున్న నాయకులు మరింత రెచ్చిపోతున్నారు అనేది టీడీపీ నాయకుల అభిప్రాయం.
ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో చాలా చోట్ల వైసీపీ తో కుమ్మక్కై టీడీపీ తరఫున బలహీనమైన అభ్యర్థులను నిలబెట్టారని, అందుకే ఫలితాలు అంత దారుణంగా వచ్చాయనేది బాబు గుర్తించారు.కానీ పార్టీ ప్రక్షాళన అంటూ ఇంత సీరియస్ గా హడావుడి చేస్తున్నా , బాబు చర్యలు తీసుకోలేరు అనే వ్యాఖ్యలు సొంత పార్టీ నాయకులే చేస్తున్నారు.