ఏపీ రాజధాని వ్యవహారంపై ముందుకు వెళ్ళలేక, వెనక్కి రాలేక ఏపీ సీఎం జగన్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు.తాను ప్రతిపాదించిన మూడు రాజధానుల అంశంపై ఇప్పటికీ జగన్ కట్టుబడే ఉన్నాడు.
రాజధాని వ్యవహారంలో వెనకడుగు వేయకుండా న్యాయ వివాదాలు రాకుండా, కోర్టులోనూ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా రాజధానిని ఏ విధంగా తరలించవచ్చు అనే విషయంపై జగన్ తీవ్ర స్థాయిలో కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది.అలాగే అసెంబ్లీలో రాజధానుల విషయంపై బిల్లు ఆమోదింప చేసుకోవాలని చూస్తున్నారు.
కానీ శాసనమండలిలో టీడీపీకి మెజారిటీ ఎక్కువగా ఉంది.కాబట్టి ఆ బిల్లు పాస్ అయ్యే అవకాశమే లేదని జగన్ గ్రహించారు.
ఈ రెండు సమస్యల పరిష్కారానికి ఏం చేయాలన్న దానిపై ఆలోచనలో పడ్డారు.
ఈ నేపథ్యంలో జగన్ కు ఒకేఒక్క ఆప్షన్ కనిపిస్తోంది.
అదే మనీ బిల్లు.మనీ బిల్ గా పేర్కొంటూ కొత్త చట్టాన్ని ప్రవేశపెడితే రాజధాని వ్యవహారాలు ముందుకు వెళ్ళవచ్చు అనేది వైసీపీ ప్లాన్.
సాధారణంగా మనీ బిల్లు అంటే కేవలం ఖర్చుల ఆమోదం కోసం పెట్టే బిల్లులు.ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టినా ఖచ్చితంగా అసెంబ్లీ ఆమోదం తీసుకోవాల్సి ఉంటుంది.
అలా ఆమోదం తీసుకున్న బిల్లునే మనీ బిల్లు అంటారు.నిబంధనల ప్రకారం మండలి ఈ బిల్లుని ఆమోదించకపోతే 14 రోజుల్లో ఆటోమెటిగ్గా ఆమోదం పొందినట్టు అవుతుంది.
ఈ సమస్యను అధిగమించేందుకు ప్రభుత్వం ఈ ఆప్షన్ను వాడుకోవాలని చూస్తోంది.అయితే ఇది సాధ్యమైన పనేనా ? దీనివల్ల న్యాయపరమైన చిక్కులు ఏమైనా వస్తాయా అనే ఆలోచనలో పడింది.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 199 ప్రకారం కేవలం మనీ బిల్లులు ఆర్ధిక అంశం తప్ప మరేవీ ఉండకూడదు.కానీ ప్రభుత్వం వాటిలోనే సీఆర్డీఏ చట్టం రద్దు, రాజధాని తరలింపు కోసం పరోక్ష నిర్ణయాలు పెట్టనుంది.ఇవి అన్నీ ఉంటే అది మనీ బిల్లు అయ్యే అవకాశం లేదని రాజ్యాంగ నిపుణులు చెబుతున్నారు.దీనిని కోర్టు కొట్టు వేస్తుందని అంటున్నారు.అందుకే న్యాయపరమైన చిక్కులు రాకుండా రాజధాని తరలింపు అనే మాట బిల్లు లో లేకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది.ప్రభుత్వం మూడు డెవలప్మెంట్ కౌన్సిళ్లను ఏర్పాటు చేస్తామని, మూడు చోట్ల నుంచి పరిపాలన చేస్తామని చెప్పాలని ప్లాన్ వేస్తోంది.
ఈ ప్లాన్ వర్కవుట్ అవుతుందా లేదా అనే విషయంపై న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటున్నారు ఏపీ సీఎం జగన్.