మ్యూజిక్ ఫెస్టివల్లో కాసేపు ఊరట చెందాలనుకున్న వారు విగత జీవులుగా మారిపోయారు.సేద తీరాలని వచ్చిన వారు శాశ్వత నిద్రలోకి జారుకున్నారు.
అమెరికన్ మ్యూజిక్ ఫెస్టివల్ జనాల ప్రాణాలను తీసింది.వివరాల్లోకి వెళితే.
అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో జరిగిన మ్యూజిక్ ఫెస్ట్కు జనం పోటెత్తడంతో తొక్కిసలాట జరిగింది.ఈ ఘటనలో కనీసం 8 మంది చనిపోయినట్లు అధికారులు చెబుతున్నారు.
రాపర్ ట్రావిస్ స్కాట్ ప్రదర్శన సందర్భంగా శుక్రవారం రాత్రి ఈ సంఘటన జరిగినట్లు హ్యూస్టన్ సిటీ ఫైర్ డిపార్ట్మెంట్ అధికారులు స్పష్టం చేశారు.దీనికి ఆస్ట్రోవరల్డ్ ఫెస్టివల్గా నామకరణం చేశారు.
ఈ తొక్కిసలాటలో పదుల సంఖ్యలో గాయపడినట్లుగా హ్యూస్టన్ ఫైర్ డిపార్ట్మెంట్ చీఫ్ శామ్యూల్ పెనా చెప్పారు.స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి 9.35 గంటలకు ఫెస్టివల్కు హాజరైన ప్రేక్షకులు ప్రదర్శనను తిలకిస్తున్నారు.అయితే ఆకస్మాత్తుగా కొందరు ప్రేక్షకులకు ఊపిరి ఆడకపోవడంతో కుప్పకూలిపోయారని పెనా చెప్పారు.
ఘటనాస్థలానికి చేరుకున్న రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలను చేపట్టినట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న దృశ్యాలను బట్టి చెప్పవచ్చు.రెండు రాత్రుల పాటు జరగనున్న ఈ ఈవెంట్కు సంబంధించి టిక్కెట్లు అమ్ముడయ్యాయి.
యంగ్ థగ్, టేమ్ ఇంపాలాల ప్రదర్శనలు చూసేందుకు జనం ఎగబడ్డారు.ఈ ఘటన తర్వాత దగ్గరలోని హోటల్లో సహాయక కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.
అయితే కొందరు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్న దానిని బట్టి.జనం బారికేడ్లను పక్కకు తోసి అప్పటికే కిందపడిపోయిన వారిని తొక్కినట్లుగా తెలుస్తోంది.సహాయక సిబ్బంది 23 మందిని దగ్గరలోని ఆసుపత్రులకు తీసుకెళ్లగా.వారిలో 11 మంది గుండెపోటుకు గురైనట్లుగా పెనా వెల్లడించారు.ఫెస్టివల్ జరుగుతున్న ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఫీల్డ్ హాస్పిటల్లో 300 మంది చికిత్స పొందుతున్నట్లు ఆయన చెప్పారు.అయితే ప్రేక్షకులు ఒక్కసారిగా ముందుకు చొచ్చుకురావడానికి దారి తీసిన కారణం ఏంటన్న దానిపై ఆరా తీస్తున్నట్లు హ్యూస్టన్ పోలీస్ డిపార్ట్మెంట్ చీఫ్ ట్రాయ్ ఫిన్నర్ మీడియాకు తెలిపారు.
ఈ ప్రాంతంలోని సీసీ టీవీ ఫుటేజ్ను, మ్యూజిక్ ఫెస్ట్ ప్రాంతంలోని వీడియోలను తాము ఇంకా విశ్లేషించలేదని ట్రాయ్ చెప్పారు.