అమెరికాలో మరోసారి తుపాకులు గర్జించాయి.లూసియానాలోని తుపాకులు విక్రయించే దుకాణంలో ఓ ఉన్మాది ప్రజలపై విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు.
ఈ ఘటనలో ముగ్గురు మరణించగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు.స్థానిక కాలమానం ప్రకారం శనివారం… న్యూఓర్లీన్స్కు వాయువ్యంగా కొన్ని మైళ్ల దూరంలో వున్న మెటైరీలోని జెఫెర్సన్ గన్ ఔట్లెట్ వద్ద ఈ కాల్పులు చోటు చేసుకున్నాయి.
మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఈ ఘటనకు సంబంధించి పోలీసులకు సమాచారం అందింది.ఔట్ లెట్లో ఓ వ్యక్తి ఇద్దరిపై కాల్పులు జరపడంతో వారిద్దరూ ఘటనాస్థలంలోనే చనిపోయినట్లు పోలీసులు తెలిపారు.
ఇదే ఘటనలో ఇద్దరు గాయాలపాలైనట్లు చెప్పారు.అయితే చనిపోయిన మూడో వ్యక్తిని నిందితుడిగా పేర్కొంటూ షెరిఫ్ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.
గాయపడిన ఇద్దరిని యూనివర్సిటీ ఆసుపత్రికి తరలించామని, ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్ధితి నిలకడగానే వుందని షెరిఫ్ కార్యాలయం ప్రకటించింది.ఈ కాల్పుల్లో మరణించిన వారు గన్స్టోర్లోని ఉద్యోగులు లేదంటే స్థానిక ప్రజలు కావొచ్చని పోలీసులు అభిప్రాయపడ్డారు.
ఇందుకు సంబంధించిన దర్యాప్తు జరుగుతున్నట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు.
కాగా, కొత్త అధ్యక్షుడు బైడెన్ అమెరికాలో పెచ్చుమీరుతున్న కాల్పుల సంస్కృతిపై ఫోకస్ పెట్టారు.ముఖ్యంగా, పాఠశాలల్లోని విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని దుండగులు కాల్పులకు తెగబడుతున్నారు.ఈ ఘటనల్లో అమాయకులైన చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారు.
దీనిపై స్పందించిన బైడెన్ అమెరికాలో ప్రాణాంతక ఆయుధాల లైసెన్స్ చట్టాలను మరింత కఠినతరం చేయాలని గత వారం కాంగ్రెస్కు సూచించారు.మూడేళ్ల క్రితం పార్క్ల్యాండ్ ఊచకోతను స్మరించుకుంటూ.
ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.ఈ ఘటన అనంతరం చాలా మంది తల్లిదండ్రులు, టీనేజర్లు ఆయుధ చట్టాలను సంస్కరించడానికి న్యాయవాదులుగా మారారని బైడెన్ గుర్తుచేశారు.
తుపాకీల అమ్మకాలకు సంబంధించి అధిక క్యాలిబర్ ఆయుధాల లైసెన్సులను మంజూరు చేయడాన్ని నిషేధించాలని అధ్యక్షుడు కాంగ్రెస్కు సూచించారు.అలాగే తుపాకీ తయారీదారులకు చట్టపరమైన ఇమ్యూనిటీని ఇవ్వడాన్ని కూడా నిషేధించాలని కోరారు.