ఏపీ అధికార పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో రోజురోజుకు అసంతృప్తి పెరిగిపోతున్నట్టుగా కనిపిస్తోంది.అధిష్టానం తీరుపై ఒక్కో నేత ఇప్పుడు గళమెత్తి మీడియా ముందుకు వచ్చి మరి విమర్శలు ఎక్కుపెడుతున్నారు.
ఇప్పటికే నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యవహారం వైసీపీకి పెద్ద తలనొప్పిగా మారింది.ఆయన బహిరంగంగా పార్టీ అధిష్టానంపై విమర్శలు చేస్తూ, మీడియా ముందుకు రావడం, సొంత పార్టీ నాయకులపైన కేసులు పెట్టడం వంటి వ్యవహారాలతో వైసీపీ విసుగెత్తిపోతోంది.
ఈ పరిస్థితుల్లో ఆయనకు షోకాజ్ నోటీసులు కూడా ఇచ్చింది.ఇక నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి ఇదే రకంగా ప్రభుత్వంపై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
ఆయన కాకుండా మరో ఇద్దరు, ముగ్గురు ఎమ్మెల్యేలు ప్రభుత్వ తీరును బహిరంగంగానే తప్పు పడుతున్నారు.
ఇదిలా ఉంటే, తాజాగా మరో వైసీపీ ఎంపీ అసంతృప్తి గానం వినిపిస్తున్న తీరుపై ఇప్పుడు పార్టీలో పెద్ద చర్చ జరుగుతోంది.
కాకపోతే ఈ వ్యవహారం మీడియాలో పెద్దగా ఫోకస్ కావడంలేదు.చిత్తూరు జిల్లా తిరుపతి ఎస్సీ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున పోటీ చేసి గెలుపొందిన బల్లి దుర్గాప్రసాదరావు ఇప్పుడు పార్టీ పై అసంతృప్తి గా ఉన్నట్టు తెలుస్తోంది.
టిడిపి నుంచి రాజకీయాల్లో అడుగు పెట్టిన దుర్గాప్రసాద్ గూడూరు నియోజకవర్గం నుంచి 1985 , 1994 , 1999 , 2009 సంవత్సరాల్లో టిడిపి టికెట్ పై పోటీ చేసి విజయం సాధించారు.చంద్రబాబుకు చిన్నప్పటి నుంచి స్నేహితుడు కూడా కావడంతో ఆయనకు పార్టీలో ప్రాధాన్యం ఇస్తూ వచ్చారు.
2014 ఎన్నికల్లో బల్లి దుర్గాప్రసాద్ సీటు ఇవ్వకపోవడంతో ఆయన వైసీపీలో చేరారు.2019 లో తిరుపతి నుంచి ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు.గెలుపొందిన దగ్గర నుంచి పార్టీలో తనకు గౌరవం లేదని, తనను ఎవరూ పట్టించుకోవడం లేదంటూ అసంతృప్తి గానం వినిపిస్తూనే వస్తున్నారు.తనకు సరైన ప్రోటోకాల్ కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అక్కడితో ఆగకుండా తిరుపతి నగరంలో నిర్మిస్తున్న గరుడ వారధి నిర్మాణం కేంద్రం ఇచ్చే స్మార్ట్ సిటీ నిధులతోనే జరుగుతోందని, రాష్ట్ర నిధులు ఏమీ లేవంటూ బహిరంగంగా వ్యాఖ్యానించి వైసిపికి ఆగ్రహం తెప్పిస్తున్నారు.
అలాగే కరోనా కట్టడి విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి తనకి నచ్చడం లేదని, బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు.ఇప్పుడు ఈయన వ్యవహారశైలిపైన, వైసీపీ అధిష్టానం దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.పార్టీ విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడడం సరి కాదని, దీనిని ఆదిలోనే కట్టడి చేయకపోతే ముందు ముందు మరింత మంది నేతలు అసంతృప్తిగానం వినిపిస్తారని వైసీపీ అధిష్టానం డిసైడ్ అయినట్లు తెలుస్తోంది .ఈయనకు నచ్చ చెప్పడమా, లేక షోకాజ్ నోటీసు ఇవ్వడమో చేయాలి అనే విషయంలో వైసిపి తర్జనభర్జన పడుతున్నట్లు తెలుస్తోంది.