అధికార పార్టీగా ఏపీలో పూర్తి స్థాయి మెజార్టీ ఉన్నా పూర్తి స్థాయిలో అధికారాన్ని అనుభవించలేని పరిస్థితుల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉంది.తమ రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న తెలుగుదేశం పార్టీ మీద అన్నిరకాలుగా కక్ష తీర్చుకుంటున్న వైసీపీకి నిత్యం తమ మీద పదే పదే విమర్శలు చేస్తున్న బీజేపీ విషయంలో ముందుకు వెళ్లలేక ఇబ్బందులు పడుతున్నారు.
ఏపీ ప్రభుత్వం పై బీజేపీ నేతలు ఎంత గట్టిగా విమర్శలు చేసినా దానికి సరైన ప్రతి విమర్శలు చేసేందుకు వైసీపీ నేతలు వెనకాడుతున్నారు.దీనికి కారణం బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండడం ఒక కారణం అయితే జగన్ కు చాలా విషయాల్లో ఉన్న భయాలు మరో కారణంగా కనిపిస్తోంది.
దీంతో తమకు అడ్డు అదుపు లేదన్నట్టుగా ఏపీ బీజేపీ నేతలు వైసీపీ మీద చెలరేగిపోతున్నారు.అంతే కాదు తెలంగాణ లో టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్న్యాయ శక్తిగా ఎదుగుతున్నబీజీపీ ఏపీలోనూ అదే తరహాలో ఎదగాలని చూస్తోంది.
కేంద్రంలో అధికారంలో ఉండటం, జాతీయ స్థాయిలో తిరుగులేని శక్తిగా ఎదగడంతో బీజేపీ ఈ ప్రయత్నాలను విజయవంతంగా అమలుచేస్తోంది.ఇక ముందు కూడా రెండు రాష్ట్రాల్లోని అధికార పార్టీలకు ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు ప్రతిపక్షం స్థాయిలో పోరాటాలు చేయాలని బీజేపీ నేతలు భావిస్తున్నారు.తెలంగాణలో వివిధ అంశాలపై కాంగ్రెస్తో సమానంగా బీజేపీ పోరాటాలు చేస్తూ ముందుకు వెళ్తోంది.ఆంధ్రప్రదేశ్లోనూ వైసీపీపై అదే స్థాయిలో బీజేపీ పోరాడుతోంది.దీంతో బీజేపీ అటు కేసీఆర్కు, ఇటు జగన్కు కొత్త సవాల్గా మారింది.కేంద్రంలో అధికారంలో ఉన్నఆ పార్టీని అంత దూకుడుగా ఎదుర్కోవడంలో టీఆర్ఎస్, వైసీపీ వెనకడుగు వేస్తున్నాయి.
ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వంతో సన్నిహిత సంబంధాలు కొనసాగించాలని జగన్ భావిస్తున్నారు.దీంతో రాష్ట్ర బీజేపీ నేతలు తమ పార్టీని ఎంతగా టార్గెట్ చేసినా వైసీపీ నేతలు పెద్దగా విమర్శలు చేయలేకపోతున్నారు.
కేంద్రంతో సన్నిహిత సంబంధాలు కొనసాగించాలని జగన్ ఎంత తాపత్రయపడుతున్నా కేంద్రం నుంచి ఏపీకి ఎటువంటి ప్రాధాన్యతా దక్కడం లేదు.ఇక ఏపీకి ప్రత్యేక హోదా సంగతే అంతా మర్చిపోయారు.
ఇతర విభజన హామీల అమలుకు సైతం కేంద్రం జగన్ ఆశించిన స్థాయిలో ముందుకు వెళ్లడంలేదు.చంద్రబాబు హయాంలో పోలవరం, విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాల్లో అవినీతి జరిగిందని, వాటన్నిటిని వెలికితీయాలనేది జగన్ టార్గెట్.
అయితే దీనికి కేంద్రం పదే పదే అడ్డం పడుతోంది.తాజాగా జగన్, కేసీఆర్ హైదరాబాద్లో ఇదే విషయమై భేటీ అయినట్టు కూడా ప్రచారం జరిగింది.
కానీ గోదావరి నీటిని కృష్ణకు తరలించడం, విభజన సమస్యలను పరిష్కరించుకోవడం కోసమే తాము కలిశామని ఇద్దరు సీఎం లు చెప్పుకున్నారు.కానీ రెండు రాష్ట్రాల్లో బీజేపీ దూకుడును అడ్డుకునే విధంగా వీరి మధ్య చర్చ జరిగిందనే విషయం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.