ఒకవైపు కేంద్ర అధికార పార్టీ బిజెపి, మరోవైపు తెలంగాణ అధికార పార్టీ టిఆర్ఎస్ అన్ని వైపులా తమను టార్గెట్ చేసుకుని రాజకీయంగా ఉక్కిరిబిక్కిరి చేస్తుండడం తో టిడిపి అధినేత చంద్రబాబు లో ఆందోళన పెరిగిపోతోంది.ఎన్నికల దగ్గరకు వచ్చిన సమయంలో తమ పార్టీ నాయకులే టార్గెట్ గా పావులు కదుపుతూ రాజకీయంగా అనేక ఇబ్బందులు సృష్టిస్తూ ఉండడం బాబుకి మింగుడు పడడం లేదు.
ఏపీలో మరోసారి అధికారం తమదేనని భావిస్తున్న తరుణంలో వైసీపీకి కలిసొచ్చేలా బిజెపి టిఆర్ఎస్ పావులు కడుపుతుండడం బాబుని ఆలోచనలో పడేస్తోంది.గత ఎన్నికల్లో బిజెపి, జనసేన సహకారంతో టీడీపీ అధికారం దక్కించుకుంది.
ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.ప్రస్తుతం టీడీపీతో జత కట్టి ముందుకు వెళ్లే పార్టీ ఒక్కటి కూడా కనిపించడం లేదు.
ఇదే బాబు ని ఆలోచనలో పడేస్తోంది.
ఇవన్నీ ఇలా ఉన్నాయి అనుకుంటుండగానే తాజాగా ఓటుకు నోటు వ్యవహారానికి సంబంధించి మరో వీడియో బయటకు రావడం, ఏపి ప్రజల డేటా కు సంబంధించిన వ్యవహారాన్ని తెలంగాణ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుని దర్యాప్తు ముమ్మరం చేయడం ఇవన్నీ టిడిపిని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి.చంద్రబాబు అతి విశ్వాసం,సంస్థలను మేనేజ్ చేయగలనన్న నమ్మకం ఇవన్నీ ఇప్పుడు బాబు కి ఇబ్బందికరంగా మారాయి.మొదటి నుంచి చూస్తే ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని వైసిపి బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్న సమయంలో చంద్రబాబు మాత్రం ప్రత్యేక హోదా వల్ల ఉపయోగం ఏమీ ఉండదని ప్రత్యేక ప్యాకేజీ తీసుకోవడం వల్ల ఏపీకి కలిసొస్తుందని భారీ స్టేట్మెంట్లు ఇచ్చాడు.
జగన్ మాత్రం ఆ నినాదాన్ని విడిచిపెట్టకుండా ప్రజల్లోకి వెళ్తుండడంతో వైసీపీకి మైలేజ్ పెరిగినట్టుగా ఇంటలిజెన్స్ డిపార్ట్మెంట్ నుంచి రిపోర్ట్స్ అందడంతో పాటు జగన్ అదేపనిగా ప్రత్యేక హోదా ఇవ్వని బీజేపీతో టిడిపి ఎలా కలిసి ఉంటోందని, మంత్రి పదవులు పంచుకుంటోందని ప్రజల్లో ఆలోచన రేకెత్తించేలా వ్యవహరించడంతో బీజేపీతో టీడీపీ తెగతెంపులు చేసుకుంది.దేశవ్యాప్తంగా మోదీ హవా తగ్గిపోతోందని భావించి భారీగా విమర్శలు కూడా చేసేసాడు.అయితే బీజేపీ మాత్రం చాప కింద నీరులా సైలెంట్ గా తాము చేయాల్సింది చేస్తూ అత్యంత కీలకమైన ఎన్నికల సమయంలో బాబు ని అన్ని రకాలుగా ఇరికించే పనిలో నిమగ్నం అవ్వడంతో బీజేపీతో అనవసరంగా తగాదా పెట్టుకుని తొందరపడ్డామా అని బాబు భావిస్తున్నాడు.