అంతర్జాతీయ ఉగ్రవాది అయిన జమాత్-ఉద్-దావా(జేయూడీ) ఉగ్రవాద సంస్థ అధినేత, 2008 నాటి ముంబయి దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ అరెస్ట్ కు రంగం సిద్దమైనట్లు తెలుస్తుంది.ఈ విషయాన్నీ గురువారం పాక్ పోలీస్ వర్గాలు వెల్లడించాయి.
తమ దేశంలోని పంజాబ్ రాష్ర్టంలో ఉగ్రవాద సంస్థలకు నిధులు అందించేందుకు విరాళాలు వసూలు చేస్తున్నారన్న కారణంతో సయీద్తో పాటు మరో 12 మంది జేయూడీ నాయకులపై పాక్ కౌంటర్ టెర్రరిజం డిపార్ట్మెంట్ బుధవారం 23 ఎఫ్ఐఆర్లను నమోదు చేసింది.అయితే ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని ప్రభుత్వ అనుమతి కోసమే తాము ఎదురుచూస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
అయితే సయీద్ ప్రస్తుతం లాహోర్లోని జౌహార్ పట్టణంలో ఉన్నాడని, ప్రభుత్వం నుంచి అనుమతి లభించిన వెంటనే అరెస్టు చేయనున్నట్లు ఒక అధికారి వెల్లడించారు.అయితే ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ఫోర్స్ ఆదేశాల మేరకు పాక్ ఈ చర్యలకు దిగినట్లు తెలుస్తుంది.
ఈ వారంలోనే అరెస్టయ్యే సూచనలున్నట్టు తెలుస్తుంది.అయితే గతంలో కూడా పాక్ ఇలానే హడావుడి చేసి చివరికి ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
అసలు గతంలో సయీద్ ని అంతర్జాతీయ ఉగ్రవాది గా ప్రకటించడానికి పాక్ అడ్డుపడుతూనే ఉంది.అంతేకాకుండా పాక్ కు తోడుగా డ్రాగన్ దేశం చైనా కూడా ఎన్నోసార్లు ఐరాస లో అడ్డుపడిన సంగతి తెలిసిందే.అయితే ఇప్పుడు పాక్ మాత్రం ఏకంగా సయీద్ ని అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు ప్రకటించడం తో భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ స్పందిస్తూ.పైపై చర్యలతో పాక్ అంతర్జాతీయ సమాజాన్ని మోసం చేసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు.