ఇటీవల బీజేపీ నేత ఒకరు ప్రభుత్వ అధికారిపై బ్యాటు తో దాడి చేసిన ఘటన గుర్తు ఉండే ఉంటుంది.ఇంకా ఆ ఘటన మరువక ముందే ఇప్పుడు తాజాగా మహారాష్ట్ర లో జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ(ఎన్ హెచ్ ఏ ఐ)డిప్యూటీ ఇంజనీర్ పై కాంగ్రెస్ శాసనసభ్యుడు తో పాటు ఆయన అనుచరులు బురద పోసిన ఘటన చోటుచేసుకుంది.
ముంబయి-గోవా జాతీయ రహదారిపై గుంతలు ఎక్కువగా ఉన్నాయన్న కారణంగా కణకావలీ కాంగ్రెస్ శాసనసభ్యుడు నీతేశ్ రాణె, కణకావలీ పురపాలక సంఘం ఛైర్మన్ సమీర్ నలవాడేలు ఆగ్రహానికి గురై తమ అనుచరులతో కలిసి ఈ దారుణానికి ఒడిగట్టారు.డిప్యూటీ ఇంజినీర్ ప్రకాశ్ షెడేకర్పై వారి అనుచరులు రెండు బకెట్లతో బురద పోసి, అనంతరం షెడేకర్ను వంతెనకు కట్టేసేందుకు కూడా యత్నించినట్లు తెలుస్తుంది.
దీనితో నితేశ్ తో పాటు ఆయన అనుచరులు 16 మందిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం.కణకావలీ వద్ద గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది.మరోపక్క నీతేశ్ రాణె నిర్వాకం పట్ల ఆయన తండ్రి నారాయణ్ రాణె క్షమాపణలు తెలిపారు.మాజీ సీఎం అయిన నారాయణ్.ప్రస్తుతం భాజపా రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సంగతి తెలిసిందే.