ఈరోజుల్లో కొన్ని హోటల్స్, రెస్టారెంట్స్( Hotels, restaurants ) జనాల వద్ద నుంచి భారీ స్థాయిలో డబ్బులు దోచేస్తున్నాయి.నాసిరకమైన ఫుడ్స్ అందిస్తూ డబ్బులు మాత్రం బాగా వసూలు చేస్తున్నాయి.
కొన్ని రెస్టారెంట్లు, వైఫై ఏసీ వంటి ఇతర సౌకర్యాల కోసం కూడా కస్టమర్ల నుంచి పెద్ద మొత్తంలో ముక్కు పిండి వసూలు చేస్తున్నాయి.తాజాగా జపాన్కు చెందిన నలుగురు స్నేహితులకు ఇటలీలోని( Italy ) ఒక రెస్టారెంట్ భారీ షాక్ ఇచ్చింది.
విహారయాత్రకు వెళ్లిన ఈ స్టూడెంట్స్ చాలా కాలం పాటు డబ్బును ఆదా చేసుకున్నారు.ఆ డబ్బుతో ఎంజాయ్ చేద్దాం అనుకున్నారు.
వారు ఇటలీకి వెళ్ళిన తర్వాత ఓస్టెరియా డా లూకా( Osteria da Luca ) అనే రెస్టారెంట్లో తినాలని నిర్ణయించుకున్నారు.రెస్టారెంట్లో అడుగుపెట్టిన తర్వాత కొన్ని స్టీక్, చేపలు ఆర్డర్ చేశారు.తినడం పూర్తి కాగానే బిల్లు చూసి షాక్ తిన్నారు.ఆ బిల్లు రూ.లక్షకు పైచిలుకు ఉండటం చూసి మొదట వారికి ఏమీ అర్థం కాలేదు.సిబ్బందిని “ఏంటి ఇంత బిల్లు వేశార”ని ప్రశ్నించగా.
రెస్టారెంట్ ఇంటర్నెట్ హాట్స్పాట్ను ఉపయోగించినందుకు ఆ రెంజ్లో బిల్లేశామని వారు చల్లగా చావు కబురు చెప్పారు.అంతేకాదు బిల్లు కట్టేంతవరకు వారిని రెస్టారెంట్ నుంచి బయటకు పంపించలేదు.
దీంతో వారు లబోదిబోమ్మన్నారు.
అనంతరం తమకు చెప్పకుండా మోసం చేశారని, అదనంగా డబ్బులు వసూలు చేశారని రెస్టారెంట్పై వారు కేసు పెట్టారు.కేసును సీరియస్గా తీసుకున్న పోలీసులు, రెస్టారెంట్ విద్యార్థులకు నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించారు.దాంతో సదరు రెస్టారెంట్ విద్యార్థులకు పెద్ద మొత్తంలో చెల్లించాల్సి వచ్చింది.
మరో రెస్టారెంట్లో సీఫుడ్ పాస్తా కోసం చాలా డబ్బు వసూలు చేశారని విద్యార్థులు వాపోయారు.ఇటలీలోని చాలా రెస్టారెంట్లలో ఇలాంటి చెడు అనుభవాలు ఎదురవుతున్నాయని వారు తెలిపారు.
కొంతమంది ట్రిప్ అడ్వైజర్లో రెస్టారెంట్ గురించి నెగిటివ్ రివ్యూస్ కూడా రాశారు.ఇలా కస్టమర్ల నుంచి అందిన కాడికి దోచేస్తున్న ఈ రెస్టారెంట్లు అందరి చేత తిట్లు తిట్టించుకుంటున్నాయి.