టాలీవుడ్లో స్టార్ హీరోలు ఒక సినిమాకు డేట్లు ఇచ్చారంటే, ఏదేమైనా ఆ డేట్లలోనే సినిమాను పూర్తి చేయాల్సి ఉంటుంది.ఇక ఈ సమయంలో దర్శకనిర్మాతల పాట్లు అన్నీఇన్నీ కావు అన్నట్లుగా ఉంటాయి.
అయితే కరోనా మహమ్మారి అందరి లెక్కలు మార్చేసింది.ఇచ్చిన డేట్లకు సినిమాను పూర్తి చేయలేకపోవడంతో, తమ సినిమాల కోసం ఇంకా ఎన్ని రోజులైనా వెయిట్ చేసేందుకు స్టార్స్ రెడీ అంటున్నారు.
అంతలా సినిమా రంగాన్ని ప్రభావం చేసిన కరోనా కారణంగా కొంత మేర మంచి జరుగుతున్నా, కొందరు మాత్రం ఇంకా కరోనా సాకుతో సినిమా షూటింగ్లకు ససేమిరా నో అంటున్నారు.
ఇప్పటికే చాలా వరకు సినిమా షూటింగ్లు మొదలైన సంగతి తెలిసిందే.
యంగ్ హీరోలు మొదలుకొని, స్టార్ హీరోల వరకు చాలా మంది తమ సినిమా షూటింగ్లలో బిజీగా ఉన్నారు.అయితే టాలీవుడ్లో చిరంజీవి, వెంకటేష్ లాంటి స్టార్ హీరోలు మాత్రం ఇంకా తమ సినిమాల షూటింగ్లను ప్రారంభించడం లేదు.
దీంతో ఆయా చిత్ర యూనిట్లు తమ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలువుతుందా అని ఆసక్తిగా చూస్తున్నారు.ఈ ఇద్దరు హీరోల వయసు మీదపడటంతో వారు తమ ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తలు వహిస్తున్నారని, అందుకే వారు కరోనా విషయంలో ఎలాంటి రిస్క్ తీసుకోవడానికి రెడీగా లేరని చిత్ర వర్గాలు అంటున్నాయి.
కాగా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఆచార్య’ చిత్ర షూటింగ్ దాదాపు సగం పూర్తయ్యిందని చిత్ర దర్శకుడు కొరటాల శివ ఇప్పటికే పలుమార్లు చెప్పుకొచ్చాడు.అటు మరో స్టార్ హీరో వెంకటేష్ నటిస్తున్న ‘నారప్ప’ చిత్ర షూటింగ్ కూడా సగం పూర్తి అయ్యింది.
మరి ఈ ఇద్దరు హీరోలు తమ సినిమా షూటింగ్లను ఎప్పుడు ప్రారంభిస్తారా అనేది ప్రస్తుతం టాలీవుడ్లో ఆసక్తికరమైన అంశంగా మారింది.ఏదేమైనా తమ అభిమాన హీరోలు వీలైనంత త్వరగా తమ సినిమా షూటింగ్లు ప్రారంభిస్తే బాగుంటుందని అభిమానులు కోరుతున్నారు.