ఏపీలో జగన్ క్యాబినెట్ లో మంత్రిగా కీలకంగా వ్యవహరిస్తున్న కృష్ణాజిల్లా మచిలీపట్నం కు చెందిన పేర్ని నాని పై హత్యాయత్నం జరగడం కలకలం రేపింది.ఓ గుర్తు తెలియని వ్యక్తి నాని పై దాడికి పాల్పడి , పొట్టలో తాపీ తో పొడిచేందుకు ప్రయత్నించగా, ఆ ప్రమాదం నుంచి నాని తృటిలో తప్పించుకున్నారు.
ఈ సంఘటనలో నాని చొక్కా చినిగి పోయింది.ఈ వ్యవహారం ఏపీలో కలకలం రేపింది.
దాడికి పాల్పడిన వ్యక్తి చెమ్మన్నగిరి పేటకు చెందిన బడుగు నాగేశ్వరరావు గా గుర్తించారు. దాడికి ప్రయత్నించినప్పుడు నాగేశ్వరరావు మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
ఈ వ్యవహారంపై మంత్రి అనుచరు లు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
కాగా ఈ వ్యవహారం రాజకీయంగానూ సంచలనం రేపింది .ఆదివారం మంత్రి పేర్ని నాని తన ఇంటి వద్ద ప్రజల్ని కలుస్తున్న సమయంలో గేటు వద్ద ఆయన ఉన్నప్పుడు తాపీ మేస్త్రి నాగేశ్వరరావు అక్కడకు వచ్చాడు.నాని కాళ్ళపై పడే ప్రయత్నం చేస్తూనే ఒక్కసారిగా తన వద్ద ఉన్న తాపీ తో ఆయనను పొడిచే ప్రయత్నం చేశాడు.
ఈ ఘటన జరిగిన వెంటనే నాగేశ్వర రావు ను మంత్రి అనుచరులు పట్టుకున్నారు.అసలు ఈ వ్యవహారం ఎందుకు జరిగిందో నాకు తెలియదు అని నాని చెప్పారు.
అయితే నిందితుడు నాగేశ్వరావు నేరచరిత్ర పై నా పోలీసులు ఆరా తీస్తున్నారు.ఈ వ్యవహారంలో ఇతర పార్టీల నాయకులు హస్తం ఏమైనా ఉందా ? మద్యం మత్తులో ఈ ఘటనకు పాల్పడ్డాడా ? ఎవరి ప్రోద్బలంతో అయినా ఈ హత్యాయత్నం చేశాడా అనే విషయంపైనా పోలీసులు ఆరా తీస్తున్నారు.
అయితే కొద్ది రోజుల క్రితం నాని ప్రధాన అనుచరుడు అయిన మోకా భాస్కరరావు ను కొంతమంది హత్య చేయడం , ఆ తర్వాత నిందితులకు సహకరించారనే అభియోగంపై తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర పై కేసు నమోదు కావడం , ఆయన జైలు జీవితం గడిపి బెయిల్ పై బయటకు రావడం వంటి వ్యవహారాలు చోటుచేసుకున్నాయి.ఇప్పుడు ఈ హత్యాయత్నం వెనుక కొల్లు రవీంద్ర పాత్ర ఏమైనా ఉందా ? లేక మరేదైనా కారణంతో ఈ హత్యాయత్నానికి పాల్పడ్డాడా అనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.