వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఆందోళనకు మద్ధతు పలికిన భారత సంతతి బ్రిటీష్ ఎంపీ తన్మన్ జిత్ సింగ్ ధేసీ ఇండియా పర్యటనలో విచిత్ర పరిస్ధితులు ఎదురవుతున్నాయి.రైతులు, రైతు సంఘాలు ఆయనను సత్కరిస్తుంటే.
కొందరు మాత్రం తన్మన్ను ఖలిస్తాన్ మద్ధతుదారుడిగా ఆరోపిస్తున్నారు.తాజాగా ఇంటర్నేషనల్ యాంటీ ఖలిస్తానీ టెర్రరిస్ట్ ఫ్రంట్ ఆయనపై తీవ్ర విమర్శలు గుప్పించింది.
అంతేకాదు.భారత వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొన్నందుకు గాను తన్మన్జిత్ సింగ్ ధేసీ ఓసీఐ కార్డును రద్దు చేయాలని కపుర్తలా డిప్యూటీ కమీషనర్ను విజ్ఞప్తి చేసింది.శుక్రవారం ఫగ్వారాలోని పిరమిడ్ కాలేజ్ ఆఫ్ బిజినెస్ అండ్ టెక్నాలజీలో సిక్కు ఫర్ సెక్యూరిటీ ఫౌండేషన్ నిర్వహిస్తోన్న ‘‘అంతర్జాతీయ సిక్కు యూత్ కాన్ఫరెన్స్’’లో ధేసీ పాల్గొనాలని ప్రతిపాదించిన నేపథ్యంలో డిప్యూటీ కమీషనర్కు ఈ లేఖ రాయడం ప్రాధాన్యత సంతరించుకుంది.ఈ కార్యక్రమంలో తన్మన్జిత్ సింగ్ పాల్గొనకుండా అడ్డుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, జిల్లా అధికార యంత్రాంగాన్ని ఇంటర్నేషనల్ యాంటీ ఖలిస్తానీ టెర్రరిస్ట్ ఫ్రంట్ కోరింది.
ఖలిస్తాన్ అనుకూల సంస్థలతో తన్మన్జిత్ సింగ్ ధేసీకి సంబంధాలు వున్నాయని వారు సదరు లేఖలో పేర్కొన్నారు.
అయితే తాను ఎలాంటి భారత వ్యతిరేక ర్యాలీకి హాజరుకాలేదని ధేసీ ఈ విమర్శలను తిప్పికొట్టారు.తాను 2020లో లండన్లో జరిగిన ర్యాలీలో భారత వ్యతిరేక ప్రసంగం చేశానని మీడియాలో వచ్చిన కథనాలు తన ప్రతిష్టకు భంగం కలిగించేవి అని తన్మన్ వ్యాఖ్యానించారు.కొందరు తనను భారత వ్యతిరేకిగా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరోవైపు నిషేధిత కార్యకలాపాల్లో పాల్గొన్నట్లు తేలితే.తన్మన్జిత్ వీసాను రద్దు చేయాలని ఫ్రంట్ కోరింది.
నిషేధిత ఉగ్రవాద సంస్థ ‘‘ సిక్ ఫర్ జస్టిస్’’ 2020లో లండన్లో నిర్వహించిన ర్యాలీలో ధేసీ.భారత వ్యతిరేక ప్రసంగం చేసినట్లు సదరు ఫ్రంట్ ఆధారాలు చూపిస్తుండటం గమనార్హం.
ఇదే సమయంలో పంజాబ్ శివసేన శాఖ కూడా ఏప్రిల్ 15న జరిగే కార్యక్రమంలో తన్మన్జిత్ను పాల్గొనకుండా నిరోధించాలని అధికారులను కోరడం కలకలం రేపుతోంది.