బీజేపీ నేతలు రాజ్యాంగంపై, అసెంబ్లీ సమావేశాలపైన అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి విమర్శించారు.మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ సమావేశాలు అత్యంత అర్థవంతంగా జరిగుతాయని అన్నారు.
దేశంలో ఎక్కడలేని అభివృద్ధి తెలంగాణలో జరుగుతోందన్నారు.ఇంత అభివృద్ధిని గవర్నర్ ప్రసంగంతో చెప్పించాలని తాము ఎందుకు అనుకోమని, టెక్నికల్ సమస్య వచ్చింది కాబట్టే రేపటి బడ్జెట్ సమావేశంలో గవర్నర్ ప్రసంగం ఉండటం లేదని వివరించారు.
1971లో 2013లో కూడా గవర్నర్ ప్రసంగం లేకుండా సమావేశాలు జరిగాయని మంత్రి వేముల తెలిపారు.2004లో పార్లమెంట్లో రాష్ట్రపతి ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాలు జరిగాయని, దీనిపై రామ్నాథ్ అతవాలే సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తే కోర్టు కొట్టేసిందన్నారు.ప్రొరోగ్ కానీ సమావేశాలకు గవర్నర్ను పిలవడం తప్పని, బడ్జెట్ సమావేశాలను గవర్నర్ ప్రారంభించాలని కూడా రాజ్యాంగంలో లేదన్నారు.
కొత్త క్యాలండర్ ఇయర్లో కొత్త సమావేశాలను మాత్రమే గవర్నర్ ప్రారంభించాలని ఉందన్నారు.2021 సెప్టెంబర్లో జరిగిన అసెంబ్లీ సమావేశాలు ప్రొరోగ్ కాలేదని, ఈ సమావేశాలు దానికి కొనసాగింపు మాత్రమేనన్నారు.ఈ క్యాలండర్ ఇయర్లో ఇది కొత్త సమావేశం కాదు కాబట్టి గవర్నర్ను పిలువాల్సిన అవసరం లేదని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు
.