అధికార టీఆర్ఎస్ పార్టీ ‘దళిత బంధు’ స్కీమ్ ద్వారా హుజురాబాద్ ఉప ఎన్నికలో నెగ్గాలని చూస్తున్న సంగతి స్వయంగా సీఎం కేసీఆర్ నోటి నుంచి వ్యాఖ్యలను బట్టి అర్థం చేసుకోవచ్చు.అయితే, ఈ స్కీమ్పైనే కౌంటర్ అటాక్కు ప్లాన్ చేస్తోంది కాంగ్రెస్ పార్టీ.
ఈ విషయం టీపీసీసీ చీఫ్ వ్యాఖ్యలతో తేటతెల్లమైంది.టీపీసీసీ చీఫ్గా రేవంత్ నియామకం తర్వాత కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ వచ్చిన సంగతి తెలిసిందే.
కాగా, గ్రౌండ్ లెవల్లో పార్టీ బలోపేతానికి కార్యచరణ రూపొందిస్తున్నారు రేవంత్.ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలకు రీచ్ అయ్యేలా ప్రోగ్రామ్స్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్గా నియమితులైన తర్వాత సీనియర్ల మద్దతు కూడగట్టుకుని పార్టీని బలోపేతం చేసేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తున్నాడు.పార్టీని ప్రజల పక్షాన నిలబెట్టేందుకు గాను ఈ నెల 9న సమర శంఖం పూరించబోతున్నాడు రేవంత్.
ఇక ‘దళిత బంధు’కు కౌటర్ అటాక్గా కాంగ్రెస్ పార్టీ తరఫున దళిత, గిరిజన హక్కుల కోసం దండోరా మోగించబోతున్నారు.కేవలం హుజురాబాద్లో మాత్రమే కాకుండా రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో ‘దళిత బంధు’ స్కీమ్ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ మేరకు కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలు పోరుకు సన్నద్ధమవుతున్నారు.ఈ స్కీమ్ అంతటా అమలు చేయాలని కోరుతూ టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇళ్ల ముందర చావు డప్పు కొట్టనున్నట్లు తెలిపారు.
స్థానికంగా ఉండే నేతలు, కార్యకర్తల సమన్వయంతో ప్రణాళికా బద్ధంగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు.మొత్తంగా అధికార పార్టీపై బలమైన కార్యచరణతో పోరాటం చేయబోతున్నది రేవంత్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.దళితులకు రూ.10 లక్షలు ఇచ్చే విషయమై రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం ప్రవేశపెట్టాలని రేవంత్ కోరుతున్నారు.ఇలా క్షేత్రస్థాయి నుంచి కాంగ్రెస్ పార్టీ తన శక్తిని పెంచుకుంటూ మళ్లీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నది.ఇందుకు రేవంత్ తన సాయశక్తుల కష్టపడుతున్నారు.