శత్రువులు ఎక్కడో ఉండరు.ఇంట్లోనే పెళ్ళాం , కూతుళ్లు, కొడుకుల రూపంలో మన చుట్టూనే ఉంటారు.
అనే సినిమా డైలాగ్ విధంగా తయారయింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి.ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఉనికి కోసం పోరాటం చేస్తోంది.
బలమైన రాజకీయ శత్రువుగా ఉన్న టిఆర్ఎస్ పార్టీని ఎదుర్కోవాలనే బలమైన కాంక్ష ఉన్నా, సొంత పార్టీ లో నెలకొన్న గ్రూపు రాజకీయాల కారణంగా కాంగ్రెస్ పార్టీ చతికిల పడుతోంది.సాధారణంగానే కాంగ్రెస్ పార్టీ అంటే వాక్ స్వాతంత్రం ఎక్కువగా ఉంటుంది.
ఎవరికి వారు తామే పెద్ద లీడర్లం అన్నట్టుగా వ్యవహరిస్తూ ఉంటారు.పార్టీలో ఇతర నాయకులకు ప్రాధాన్యం పెరగకుండా, ప్రతిక్షణం అడ్డుకుంటూ పీత సామెతను గుర్తు చేస్తూ ఉంటారు.
మొదటి నుంచి తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఇదే రకమైన పరిస్థితి ఉండడంతో, దీనిని తమకు అనుకూలంగా మార్చుకుని టిఆర్ఎస్ రెండుసార్లు అధికారం దక్కించుకొగలిగింది.ఇదంతా ఇలా ఉంటే, టిడిపి నుంచి కాంగ్రెస్ లోకి వచ్చి అనతికాలంలోనే కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి సంపాదించిన రేవంత్ రెడ్డి వ్యవహారంలో కాంగ్రెస్ సీనియర్లు ఒక్క తాటిపైకి వచ్చి ఆయన హవా పెరగకుండా నిత్యం అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
కానీ రేవంత్ మరింత కీలకమైన తెలంగాణ పిసిసి అధ్యక్ష పదవి దక్కించుకునే క్రమంలో దూకుడుగా వ్యవహరిస్తూ వస్తున్నారు.టిఆర్ఎస్ పై పెద్ద ఎత్తున ఎదురు దాడి చేస్తూ, తన పరపతి హైకమాండ్ వద్ద పెరిగే విధంగా ప్రయత్నాలు చేస్తూనే వస్తున్నారు.
ఈ క్రమంలో రేవంత్ అనేక కేసులు ఎదుర్కుంటూ జైలు పాలు అవుతున్నా, ఆయన లెక్కచేయకుండా దూకుడుగా ముందుకు వెళ్తున్నారు.ఇదే కాంగ్రెస్ సీనియర్లు ఎవరికీ నచ్చడం లేదు.రేవంత్ ను ఒంటరి చేసేందుకు కాంగ్రెస్ సీనియర్లంతా ఏకతాటిపైకి వచ్చి రేవంత్ దూకుడుకు బ్రేకులు వేసే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు.పార్టీ సీనియర్లు వి.హనుమంతరావు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జగ్గారెడ్డి వంటి వారు రేవంత్ విషయంలో కాస్త యాక్టివ్ గా ఉంటూ విమర్శలు మొదలు పెట్టారు.రాజకీయ ప్రత్యర్థులపై వదలాల్సిన విమర్శల బాణాలను సొంత పార్టీ నాయకులపైనా ఎక్కిపెడుతూ దృష్టి మొత్తం రేవంత్ పైనే పెట్టినట్టుగా వ్యవహరిస్తున్నారు.
అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ రేవంత్ కు పిసిసి అధ్యక్ష పదవి ఇవ్వవద్దని, ఆయన స్థానంలో పార్టీలో వేరే వారికి ఆ పదవి అప్పజెప్పినా సహకరిస్తామని సీనియర్లంతా హైకమాండ్ కు సంకేతాలు పంపిస్తున్నారు.రేవంత్ మాత్రం పిసిసి అధ్యక్ష పదవి విషయంలో సీనియర్ నాయకుల అడ్డంకులను అధిగమించి ముందుకు వెళ్తున్నారు.
తాజాగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి.హనుమంతరావు రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు.తన నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో ఈ తరహా వ్యవహారం ఎప్పుడూ చూడలేదని, రేవంత్ రెడ్డి పద్ధతి మార్చుకోవాలని ఆయన హితవు పలుకుతున్నారు.
సీనియర్ నాయకులను కించపరిచే విధంగా రేవంత్ తన అనుచరులతో సోషల్ మీడియాలో తప్పుడు కథనాలను ప్రచారం చేస్తున్నారని మండిపడుతున్నారు.
ఇలా ఒకరికి ఒకరు విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీని బలహీనం చేస్తుండటంపై అధిష్టానం కూడా తెలంగాణ నాయకుల తీరుపై అసహనంగా ఉన్నట్టు తెలుస్తోంది.