తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో తహశీల్దార్ వనజాక్షి మీద ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దాడి చేసాడనే వార్త ఎంత సంచలనం అయ్యిందో అందరికి తెలిసిందే.ఇసుక తవ్వకాల విషయంలో ఎమ్మెల్యేకి, తహశీల్దార్ వనజాక్షికి జరిగిన గొడవ పెద్దగా మారి ఆమె మీద ఎమ్మెల్యే అనుచరులు దాడి చేసినంత వరకు వచ్చింది.
అయితే ఈ ఘటనలో వనజాక్షిదే తప్పని తేల్చిన టీడీపీ ప్రభుత్వం ఆమెని సస్పెండ్ చేసింది.అయితే ఇప్పుడు మరోసారి ఈమె కృష్ణా జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.
భూముల పంపిణీలో భాగంగా ప్రభుత్వం రైతుల నుంచి భూసేకరణ చేస్తుంది.అయితే చాలా మంది రైతులు దీనిని వ్యతిరేకిస్తున్నారు.తాము పండించుకున్న భూములని తీసుకొని వేరొకరికి ఎలా ఇస్తారని ఇప్పటికే రాష్ట్రంలో పలు చోట్ల ఆందోళనలు చేస్తున్నారు.తాజాగా విజయవాడ రూరల్ ఎమ్మార్వో గా ఉన్న వనజాక్షి కొత్తూరు తాడేపల్లికి వెళ్లారు.
అయితే రైతులు భూములు ఇవ్వబోమని అది తమ జీవనాధారమని చెప్పారు.ఈ క్రమంలో ఆమె రైతులతో గొడవకి దిగింది.
రైతులను రియల్ ఎస్టేట్ బ్రోకర్స్ అని వనజాక్షి సంభోదించింది.దీంతో రైతులు అందరూ ఆవేశంతో ఆమెని చుట్టూ ముట్టారు.
అధికారులకి అండగా వచ్చిన వారు, రైతులు మధ్య తోపులాట చోటు చేసుకుంది.వనజాక్షి ని పోలీసు వాహనంలో తరలించడంతో పరిస్థితి సద్దుమణిగింది.
అయితే అప్పట్లో ఎమ్మెల్యే దాడిలో వనజాక్షికి ప్రజా మద్దతు లభిస్తే.ఇప్పుడు జరిగిన దాడి ఘటనలో ప్రజా ఆగ్రహం ఎదురైంది.
ఆమె వైసీపీ పార్టీకి తొత్తుగా మారి ప్రనిచేస్తూ రైతులని బెదిరిస్తుందని పలువురు స్థానిక రైతులు ఆరోపిస్తున్నారు.