పశ్చిమ బెంగాల్ లో ఐదో విడత పోలింగ్ కొద్దిసేపటి క్రితం (నేటి ఉదయం 7 గంటలకు) ప్రారంభమైంది.కోల్ కతా దక్షిణం, 24 పరగణ, హూగ్లీ జిల్లాల పరిధిలోని 53 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ ప్రారంభమైంది.
ఈ నియోజకవర్గాల్లో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో పాటు పలువురు ప్రముఖుల నియోజకవర్గాలున్నాయి.నారదా స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురు నేతలు కూడా ఈ దఫా పోలింగ్ లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
ఈ దఫా ఎన్నికల్లో అందరి దృష్టి భవానీ పూర్ నియోజకవర్గంపైనే ఉంది.ఈ నియోజకవర్గంలో అధికార పార్టీ అభ్యర్థిగా మమతా పోటీ చేస్తుండగా… ఆమెకు పోటీగా కాంగ్రెస్ నుంచి కేంద్ర మాజీ మంత్రి దీపా దాస్ మున్షీ, బీజేపీ నుంచి సుభాష్ చంద్రబోస్ మనవడు చంద్రకుమార్ బోస్ బరిలోకి దిగారు.
ఇక్కడ ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొనకుండా ఉండేందుకు పోలీసులు 144 సెక్షన్ ఆంక్షలను విధించారు.కొద్దిసేపటి క్రితం ప్రారంభమైన పోలింగ్ నేటి సాయంత్రం 6 గంటల దాకా నిర్విరామంగా కొనసాగనుంది.