ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్, ఇంకా తన ప్రతాపాన్ని చూపిస్తూనే ఉంది.ఇప్పటికే ఎనిమిది నెలలకు పైగా ఈ మహమ్మారి భారతదేశాన్ని అతలాకుతలం చేయగా, దీని దెబ్బకు అనేక రంగాలు మూతపడే స్థాయికి పడిపోయాయి.
ఈ వైరస్ పెద్ద సంఖ్యలో ప్రబలకుండా ఉండేందుకు భారత ప్రభుత్వం మార్చి నెల నుండి పలు దఫాలుగా పూర్తి లాక్డౌన్ను విధించిన సంగతి తెలిసిందే.ఈ లాక్డౌన్ కారణంగా అన్ని రంగాలకు చెందిన పనులు పూర్తిగా స్తంభించిపోయాయి.
కాగా సినిమా రంగంపై లాక్డౌన్ ఎఫెక్ట్ చాలా దారుణంగా పడింది.ఇప్పటికే పలు రంగాలకు లాక్డౌన్ నుండి వెసులు బాటు కలిపించినా, సినిమా రంగం మాత్రం ఇంకా పూర్తి స్థాయిలో కోలుకోలేదు.
కాగా ఈ లాక్డౌన్ కారణంగా టాలీవుడ్కు చెందిన సినిమా షూటింగ్లు కొద్దికొద్దిగా ప్రారంభం అవుతున్నాయి.కాగా సినిమా థియేటర్లను తెరుచుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం ప్రకటించినా, తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు ఇంకా తెరుచుకోలేదు.50 శాతం అక్యుపెన్సీతో థియేటర్లు నడపడం కష్టంగా మారిందని తెలుస్తోంది.కాగా హైదరాబాద్కు చెందిన ప్రముఖ సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఏకంగా మూతపడనున్నట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలో హైదరాబాద్లోని గెలాక్సీ థియేటర్(టోలిచౌకి), శ్రీరామ థియేటర్(బహదూర్ పుర), అంబ థియేటర్(మెహదీపట్నం), శ్రీమయూరి థియేటర్(ఆర్టీసీ క్రాస్ రోడ్), శాంతి థియేటర్(నారాయణగూడ)లు శాశ్వతంగా మూతపడనున్నట్లు తెలుస్తోంది.గతంలో మల్టీప్లెక్సుల నుండి తీవ్ర పోటీ ఉన్న సమయంలోనూ ఈ థియేటర్లు ప్రేక్షకులను అలరిస్తూ వచ్చాయి.
కానీ లాక్డౌన్ కారణంగా పూర్తిగా ఆదాయం కోల్పోయిన ఈ థియేటర్లు ఇక శాశ్వతంగా మూతపడనున్నాయి.వీటిని ఫంక్షన్ హాళ్లుగా మార్చేందుకు సదరు యాజమాన్యాలు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
పేరుమోసిన థియేటర్లు మూతపడుతుండటంతో హైదరాబాదీలు బాధపడుతున్నారు.ఇంత కాలంగా తమను అలరిస్తూ వచ్చిన ఈ థియేటర్లు ఇకపై కనుమరుగవుతుండటం నిజంగా బాధాకరమని వారు అంటున్నారు.