పంజాబ్, గుజరాత్, హర్యానా విద్యార్ధుల దరఖాస్తులపై ఆస్ట్రేలియన్ యూనివర్సిటీల ఆంక్షలు.. కారణమిదే..?

మోసాలు, నకిలీ డాక్యుమెంట్లతో స్టూడెంట్ వీసాకు( Student Visa ) దరఖాస్తులు పెరుగుతున్న నేపథ్యంలో ఆస్ట్రేలియాలోని కొన్ని యూనివర్సిటీలు( Australian Universities ) సంచలన నిర్ణయం తీసుకున్నాయి.

పలు భారతీయ రాష్ట్రాలకు చెందిన విద్యార్ధులకు అడ్మిషన్ ఇవ్వకూడదని నిర్ణయించినట్లుగా కథనాలు వస్తున్నాయి.

విక్టోరియాలోని ఫెడరేషన్ యూనివర్సిటీ( Federation University ), న్యూసౌత్ వేల్స్‌లోని వెస్ట్రన్ సిడ్నీ యూనివర్సిటీలు భారతీయ రాష్ట్రాలైన పంజాబ్, హర్యానా, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, జమ్మూకాశ్మీర్‌లకు చెందిన విద్యార్ధులకు అడ్మిషన్ ఇవ్వొద్దని గత వారం ఎడ్యుకేషన్ ఏజెంట్లకు లేఖ రాసినట్లుగా ది సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ నివేదించింది.భారత ప్రధాని నరేంద్ర మోడీ( PM Narendra Modi ) ఆస్ట్రేలియా పర్యటనలో వుండగానే ఈ ప్రకటన వెలువడటం ప్రాధాన్యత సంతరించుకుంది.

కొన్ని భారతీయ ప్రాంతాల నుంచి హోమ్ అఫైర్స్ డిపార్ట్‌మెంట్ తిరస్కరించిన వీసా దరఖాస్తుల నిష్పత్తిలో గణనీయమైన పెరుగుదలను తాము గమనించినట్లు ఫెడరేషన్ యూనివర్సిటీ ఏజెంట్లకు రాసిన లేఖలో పేర్కొంది.ఇది స్వల్పకాలిక సమస్యగానే వుంటుందని భావించామని .కానీ సమస్య మరోలా వుందని తెలిపింది.గత నెలలో, విక్టోరియా విశ్వవిద్యాలయం, ఎడిత్ కోవాన్ విశ్వవిద్యాలయం, టొరెన్స్ విశ్వవిద్యాలయం, సదరన్ క్రాస్ విశ్వవిద్యాలయంతో సహా కొన్ని ఆస్ట్రేలియన్ యూనివర్సిటీలు పలు భారతీయ రాష్ట్రాల విద్యార్థులపై నిషేధం లేదా ఆంక్షలు విధించాయి.

2022లో అధ్యయనం ప్రారంభించిన భారతీయ విద్యార్ధులు రిజిస్టర్ చేసుకోలేదని, ఫలితంగా అట్రిషన్ రేటు అధికంగా వుందని వెస్ట్రన్ సిడ్నీ యూనివర్సిటీ( Western Sydney University ) మే 8న పంపిన సందేశంలో ఏజెంట్లకు తెలిపింది.ఇదే సమయంలో భారత్‌లోని పంజాబ్, గుజరాత్, హర్యానాలలో అట్రిషన్ ఎక్కువగా వున్నట్లు వర్సిటీ గుర్తించింది.ఈ కారణంగా పైన పేర్కొన్న ప్రాంతాల నుంచి విద్యార్ధుల రిక్రూట్‌మెంట్‌ను నిలుపుదల చేయాలని నిర్ణయించింది.

Advertisement

అయితే భారత్‌లోని మిగిలిన రాష్ట్రాలకు చెందిన విద్యార్ధులకు మాత్రం యథావిధిగా అనుమతులు మంజూరు చేస్తున్నట్లు తెలిపింది.

వెస్ట్రన్ సిడ్నీ యూనివర్సిటీ భారతీయ రాష్ట్రాలపై తీసుకున్న నిషేధాన్ని రెండు నెలల పాటు అమలు చేయాలని భావిస్తోంది.అప్లికేషన్ స్క్రీనింగ్‌లో మార్పులు, కఠినమైన అడ్మిషన్ నిబంధనలు, రుసుములు పెంపు వంటి చర్యల ద్వారా భారత్‌లోని ఆయా రాష్ట్రాల విద్యార్ధుల మోసాలపై చర్యలు తీసుకోవాలని వర్సిటీలు యోచిస్తున్నాయి.భారత్ నుంచి వస్తున్న ప్రతి నాలుగు దరఖాస్తుల్లో ఒకటి మోసపూరితమైనదిగా వుంటోందని ఆస్ట్రేలియా హోం వ్యవహారాల శాఖ నివేదిక చెబుతోంది.

Advertisement

తాజా వార్తలు