ఉన్నత చదువుల కోసమో, ఆర్ధిక పరమైన ఎదుగుదల కోసమో భారత్ విడిచి పొరుగు దేశాలు వెళ్లి స్థిరపడిన వారు ఎంతో మంది ఉన్నారు.అలా వెళ్ళిన భారతీయులు ఆయా దేశాలలో స్థిరపడటమే కాకుండా అక్కడ సేవా చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎంతో మందికి సాయం అందిస్తూ స్పూర్తి నింపుతున్నారు.
ముఖ్యంగా భారత్ లోని తెలుగు రాష్ట్రాల నుంచీ వెళ్లి స్థిరపడినవారు ఎంతో మంది అక్కడి తెలుగు వారి కోసం, తెలుగు రాష్ట్రాల నుంచీ ఆయా దేశాలు వెళ్లాలని భావిస్తున్న తోటి తెలుగు ప్రజల కోసం ఎన్నో అవగాహన, సహాయ కార్యక్రమాలు చేపడుతున్నారు.
ఈ క్రమంలోనే యూకె లో ఉంటున్న ఓ తెలుగు మహిళ అక్కడికి వచ్చే తెలుగు వారికి సాయం అందించేందుకు సోషల్ మీడియాలో కమ్యూనిటీ ని స్థాపించి ఎంతో మంది తెలుగు వారికి సహాయ సహకారాలు అందిస్తున్నారు.
యూకే రావాలనుకునే వారు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వారికి తగిన సూచనలు సలహాలు ఇస్తూ గడిచిన కొన్నేళ్లుగా సాయం అందిస్తున్నారు.ఇలా 2006 లో స్థాపించబడిన ఈ కమ్యూనిటీ ప్రస్తుతం 9 వేల మందితో కొనసాగుతోంది.
అయితే యూకే ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి ఇచ్చే మోస్ట్ ఇన్సపైరింగ్ అవార్డ్స్ 2022 లో ఇన్సపైరింగ్ ఇండియన్ విమెన్ గ్లోబల్ అవార్డ్ ను కమ్యూనిటీ స్పిరిట్ కేటగిరీలో అందుకున్నారు.ఈ అవార్డ్ అందుకున్న తెలుగు మహిళగా ఆమె రికార్డ్ క్రియేట్ చేసారు.ఈ అవార్డ్ కోసం ప్రపంచ వ్యాప్తంగా సుమారు 25 దేశాల నుంచీ 150 నామినేషన్లు రాగా అందులో ఎంతో ప్రతిభ కనబరిచి చివరి రౌండ్ లో మూడవ స్థానంలో నిలిచారు.ఈ కమ్యూనిటీ ని ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం వరదల కారణంగా ఇండియాలో ఎంతో మంది ఆహారం లేక ఇబ్బందులు పడుతారని, ఒంటరి మహిళలు కూడా ఆర్ధిక ఇబ్బందులకు గురవుతున్నారని అలాంటి వారికి సాయం అందించేందుకు ఈ గ్రూప్ ను ఏర్పాటు చేసానని హిమ వల్లి తెలిపారు.