కరోనా మహమ్మారి విజృంభణ వల్ల గతంలో మనకు పెద్దగా తెలియని లాక్ డౌన్ అనే పదం పరిచయమైంది.లాక్ డౌన్ వల్ల దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో రవాణా వ్యవస్థ స్తంభించడంతో పాటు వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు ఆగిపోయాయి.
అయితే కేంద్రం ఆ తరువాత లాక్ డౌన్ నిబంధనలు సడలించింది.అయితే ఏపీలోని ఒక ప్రాంతంలో 48 గంటల పాటు లాక్ డౌన్ అమలు కానుంది. ఆ ప్రాంతంలో దాదాపు 1500 మంది పోలీసులను అధికారులు మోహరించడంతో పాటు 144 సెక్షన్ ను కఠినంగా అమలు చేస్తున్నారు.పూర్తి వివరాల్లోకి వెళితే కర్నూలు జిల్లాలోని దేవరగట్టు ప్రాంతంలో దసరా పండుగ పూర్తైన తరువాత రెండు రోజుల పాటు బన్నీ ఉత్సవాలు జరుగుతున్నాయి.
బన్నీ ఉత్సవాల్లో భాగంగా ఉత్సవ విగ్రహం కోసం 34 గ్రామాల ప్రజలు కర్రల సమరంలో పాల్గొంటారు.ప్రతి సంవత్సరం బన్నీ ఉత్సవాల వల్ల పదుల సంఖ్యలో ప్రజలు గాయాలపాలవుతున్నారు.
ఈ ఉత్సవాల వల్ల కొంతమంది ప్రాణాలు కోల్పోయారు.అయితే ఈ ఏడాది కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో బన్నీ ఉత్సవాలకు అనుమతులు ఇస్తే లక్షల సంఖ్యలో ప్రజలు కరోనా మహమ్మారి బారిన పడే అవకాశం ఉందని అధికారులు భావించారు.
కర్నూలు జిల్లా కలెక్టర్ ఈ సంవత్సరం బన్నీ ఉత్సవాలు జరగకూడదని లాక్ డౌన్, 144 సెక్షన్ కఠినంగా అమలు చేసేలా ఆదేశాలు జారీ చేశారు. ఉత్సవ నిర్వాహకులు బన్నీ ఉత్సవాలు జరపాల్సిందేనని పట్తుబడుతున్నా అధికారులు 11 చెక్ పోస్టులను ఏర్పాటు చేసి దేవరగట్టు గ్రామంలో ఇతర గ్రామాల ప్రజలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఆ గ్రామానికి తిరిగే బస్సులపై సైతం ఆంక్షలు విధించారు.సంప్రదాయం పేరుతో తలలు పగలగొట్టుకునే ఈ ఉత్సవాల రద్దు వల్ల రక్తపాతాన్ని కూడా ఆపినట్టు అవుతుందని జిల్లా ప్రజలు అభిప్రాయపడుతున్నారు.