తెలంగాణ అధికార పార్టీ టిఆర్ఎస్ హుజురాబాద్ ఎన్నికల ఫలితాలతో డీలా పడింది.దాని నుంచి బయటపడేందుకు పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం పెంచేందుకు వరంగల్ లో విజయ్ గర్జన పేరుతో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసేందుకు చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
అయితే రాబోయే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ విజయ గర్జన ఏర్పాట్లను చేస్తున్నారు.ఈ విజయ గర్జన సభ అనంతరం పార్టీ పదవులను భారీ ఎత్తున భర్తీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
కొత్త కమిటీల్లో సామాజిక వర్గాల వారీగా ప్రాధాన్యం కల్పించే విధంగా కూర్పు చేసినట్లు తెలుస్తోంది.ఈ కొత్త కమిటీ ఏర్పాటు విషయంలో పూర్తిగా బాధ్యతలను మంత్రి కేటీఆర్ తీసుకున్నారట.
దీంతో కొత్త కమిటీలో చోటు సంపాదించుకునేందుకు అప్పుడే పార్టీ నాయకులు కేటీఆర్ దృష్టిలో పడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట.
తెలంగాణలో ఏ పార్టీకి లేని విధంగా 60 మందితో రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేయబోతున్నారట.
కొత్త కమిటీ లో మహిళలు, పార్టీ సీనియర్ నాయకులు, తెలంగాణ ఉద్యమకారులకు అవకాశం కల్పించాలని ప్లాన్ చేసినట్లు టిఆర్ఎస్ లో ప్రచారం జరుగుతోంది.ముఖ్యంగా ప్రధాన కార్యదర్శుల పదవులు దక్కించుకునేందుకు ఎమ్మెల్యేలు, ఎంపీలు మంత్రులు గతంలో పార్టీలో కీలక పదవులు అనుభవించిన నేతలు ఇలా అంతా ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం.
అయితే ప్రస్తుత కమిటీలో ఉన్న వారిలో 10 శాతం మందికి మాత్రమే కొత్త కమిటీలో అవకాశం కల్పించి, పూర్తిగా కొత్త వారికి పార్టీ పదవులను సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు అనుకున్న వారికి, రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో గట్టి ప్రభావం చూపించగలరు అనుకున్న వారికి ఈ పదవుల్లో తగిన ప్రాధాన్యం ఇచ్చేందుకు ఈ కమిటీలు విషయంలో ఎక్కడా ఎటువంటి అసంతృప్తులు తలెత్తకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ ఈ జంబో కమిటీని ఏర్పాటు చేయబోతున్నారట.ఇక ఏ విషయంలోనూ వెనకడుగు వేయకుండా రాబోయే ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా టీఆర్ఎస్ ను పరుగులు పెట్టించేందుకే కేసీఆర్ కేటీఆర్ ప్రయత్నాలు చేస్తుండడం.పార్టీ నాయకుల్లో మరింత ఉత్సాహం కలిగిస్తోంది.