కరోనా, లాక్ డౌన్ వల్ల షూటింగ్ లు నిలిచిపోయిన ఫిల్మ్ ఇండస్ట్రీలో డ్రగ్స్ కలకలం రేపుతోంది.బాలీవుడ్ స్టార్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతికి, డ్రగ్స్ కు సంబంధం ఉన్న నేపథ్యంలో సీబీఐ, నార్కోటిక్స్ అధికారుల దర్యాప్తులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
ఇదే సమయంలో బాలీవుడ్ నటి కంగనా రనౌత్ సినీ ఇండస్ట్రీలో ప్రముఖులు డ్రగ్స్ తీసుకున్నారని చెప్పడంతో పాటు మహారాష్ట్ర సర్కార్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచింది. అయితే ఈ నెల 9వ తేదీన కంగనాకు ముంబాయికు వెళతానని చెప్పడంతో ఆమెకు బెదిరింపు కాల్స్ వచ్చాయి.
దీంతో కంగనా తండ్రి, సోదరి విజ్ఞప్తి నేపథ్యంలో కేంద్ర హోం శాఖ ఆమెకు వై ప్లస్ కేటగిరి భద్రత కల్పించింది.అయితే అనేక వివాదాల నడుమ ముంబై వెళ్లిన కంగనా నిన్న ఉదయం మనాలీలోని ఇంటికి చేరుకున్నారు.
కంగనా ముంబైకు వెళ్లి మనాలీకి తిరిగి రావడంతో బ్రిజేష్ కల్లప్ప అనే సుప్రీం కోర్టు అడ్వకేట్ కంగనాకు వై ప్లస్ సెక్యూరిటీని తొలగించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
బ్రిజేష్ తన ట్వీట్ లో ఒక మనిషికి 30 రోజుల పాటు వై ప్లస్ సెక్యూరిటీ కల్పించాలంటే కేంద్రం 10 లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుందని….
ప్రజల నుంచి వసూలు చేసిన పన్నులు కేంద్రం ఖర్చు చేయాల్సి ఉంటుందని… హిమాచల్ ప్రదేశ్ లో కంగనా సురక్షితంగా ఉండటంతో సెక్యూరిటీని తొలగించాలని పేర్కొన్నారు.అయితే కంగనా బ్రిజేష్ చేసిన ట్వీట్ గురించి స్పందించి ఘాటుగా సమాధానం ఇచ్చింది.
కేంద్రం మనం చెప్పే వాటిని ఊహించుకుని భద్రత కల్పించాలని అనుకోదని….ఇంటెలిజెన్స్ బ్యూరో చెప్పిన సమాచారం, సూచనల ఆధారంగానే కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని కంగనా అన్నారు.
ఆ విషయాలను బట్టే సెక్యూరిటీ గ్రేడ్ ను నిర్ణయిస్తారని పేర్కొన్నారు.ఐబీ నివేదికలో ప్రమాదం లేదని తెలిస్తే భద్రతను తగ్గిస్తుందని ఎవరూ తన భద్రత గురించి ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదని కంగనా పేర్కొంది.