ఇరాన్ అగ్రశ్రేణి సైనిక జనరల్ ఖాసిం సులేమానీని ఇటీవల అమెరికా బలగాలు రాకెట్ దాడి తో హతమార్చిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో ఆయన అంత్యక్రియలు సోమవారం ఘనంగా జరిగాయి.
అయితే మొన్నటివరకు ఉప్పు నిప్పుగా వ్యవహరిస్తున్న అమెరికా,ఇరాన్ ల మధ్య ఈ ఘటన మరింత ఆజ్యం పోసినట్లు అయ్యింది.ఈ చర్య తో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పై ఇరాన్ తీవ్ర స్థాయిలో మండిపడుతుంది.
ఈ క్రమంలో ట్రంప్ తలకు రేటు కూడా కట్టింది.ట్రంప్ తలను చంపి తెస్తే 80 మిలియన్ డాలర్ల(575.44 కోట్లు) నజరానా ను ప్రకటించింది.ఇరాన్ జనాభా 8 కోట్లు కాగా ఒక్కో పౌరుడూ తమ వాటా కింద ఒక్కొక్క డాలర్ ను ట్రంప్ ను హతమార్చేందుకు అందజేస్తారు అని, ఇది దేశం తీసుకున్న ప్రతిన అని అధికారికంగా ప్రకటించడం గమనార్హం.
సోమవారం సులేమాని అంతిమ యాత్ర నేపథ్యంలో అక్కడి అధికారిక వార్తా సంస్థ ఇదే విషయాన్నీ పదే పదే ప్రసారం చేసింది.
సులేమాని అంతిమ యాత్ర కోసం టెహరాన్ వీధులన్నీ కూడా జనసంద్రంగా మారిపోయాయి.ఏ నాయకుడి కి కూడా ఇంత స్థాయిలో ప్రజలు అంతిమయాత్రలో పాల్గొనలేదు.నల్లటి దుస్తులు ధరించి,తమహీరో సులేమాని చిత్ర పాఠాన్ని చేత పట్టుకొని ‘అమెరికాకు చావు తప్పదు ట్రంప్ ను చంపేస్తాం’ అని అంటూ ప్రజలు నినాదాలు చేశారు.
మరోపక్క సులేమాని కుమార్తె కూడా తన తండ్రి చావు తో అంతా ముగిసిపోయింది అని అనుకోవద్దు అంటూ హెచ్చరించిన విషయం తెలిసిందే.సాధారణంగా ముభావంగా, అత్యంత సంయమనంతో ఉండే అధినేత ఆయతుల్లా ఖొమైనీ కూడా సార్వత్రిక ప్రార్థనల్లో ఓ దశలో కన్నీరు ఆపుకోలేక ఏడ్చేయడం విశేషం.80 ఏళ్ల ఖొమైనీకి సులేమానీతో అత్యంత ఆత్మీయబంధం ఉన్న సంగతి తెలిసిందే.ఎన్నో ప్రజాకార్యక్రమాల్లో వీరిద్దరూ పాల్గొన్నప్పుడు పలుసార్లు బహిరంగంగానే సులేమాని నుదుటి పై ఖొమైనీ ముద్దాడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.
ఇద్దరి మధ్య అంత అనుబంధం ఉండేది.సులేమాని కూడా ఒక్క ఖొమైనీకి మాత్రమే జవాబుదారిగా ఉండేవారు.దేశ ప్రధానికి కూడా తలవంచని సులేమాని ఖొమైనీ విషయంలో మాత్రం జవాబుదారుడు గా ఉండేవాడు.ఖుద్స్ ఫోర్స్ చీఫ్ గా ఉన్న సులేమాని పై చాలా అభిమానం చూపేవారు.
ఆయన మరణం వారంతా జీర్ణించుకోలేకపోతున్నారు.ఇలా అమెరికా దొంగ దెబ్బ తీసింది అంటూ ట్రంప్ పై ఇరాన్ మండిపడుతుంది.
మరి ఇరు దేశాల మధ్య రాజుకున్న ఈ చిచ్చు ఎంతటి పరిణామాలకు దారి తీస్తుందో చూడాలి.మరోపక్క ఇరాన్ 2015 నాటి అణుఒప్పందానికి కూడా కట్టుబడబోమని ప్రకటించడం తో ఇప్పుడు అసలు సమస్య మొదలైంది.
ఎలాంటి నిర్ణయం తో ఇరాన్ విరుచుకు పడుతుందో అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.మరో పక్క ఇరాన్ హెచ్చరికలకు ట్రంప్ కూడా తనదైన శైలి ప్రతి హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
‘ఇరాన్కు ఎన్నటికీ అణ్వాయుధం చేతికి చిక్కదు’’ అని సోమవారం ట్వీట్ చేసిన ట్రంప్ ‘‘దాడి చేస్తే విరుచుకుపడతాం.ఇరాన్పై వైమానిక దాడులు చేస్తాం.
తప్పదు’’ అని ప్రతి హెచ్చరికలు జారీ చేశారు.
ఇక తమ దేశం నుంచి వెళ్లిపోవాలని ఇరాకీ పార్లమెంటు అమెరికా దళాలను కోరడంపై కూడా ట్రంప్ ఈ సందర్భంగా మండిపడ్డారు.
‘‘ఇరాక్లో స్థావరం కోసం, ఇరాకీయుల రక్షణ కోసం మేం కోట్లాది డాలర్లు ఖర్చు చేశాం.అదంతా ఇరాక్ మాకు చెల్లిస్తే వెళ్లిపోతాం’’ అంటూ ట్రంప్ మెలికపెట్టారు.దీనిపై ఇరాక్ కస్సుమంది.ఇప్పటికే దేశాన్ని ధ్వంసం చేసుకున్నామని, ఇంకా అమెరికన్ ఆధిపత్యాన్ని అంగీకరించలేమని పార్లమెంట్ సభ్యులు తేల్చిచెప్పారు.
కాగా ట్రంప్ చేస్తున్న హెచ్చరికలు, మెలికలు, అణు ఒప్పందం నుంచి ఇరాన్ వైదొలగడం.మొదలైన పరిణామాలు నాటో దేశాల్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి.
ఎప్పుడు ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో అన్న ఉద్దేశ్యం తో నాటో దేశాలు ఆందోళన చెందుతున్నాయి.