ఇళ్లల్లో పిల్లలు చాలా సందర్భాల్లో తిండి తిననని మారాం చేస్తుంటారు.అయితే సాధారణ పరిస్థితుల్లో తిండి తినకపోయినా సమస్య లేదు కానీ కరోనా కాలంలో పిల్లలు తిండి తినకపోయినా అనుమానించాలని నిపుణులు చెబుతున్నారు.
పిల్లలు తిండి తినకపోవడం కరోనా కొత్త లక్షణమని సూచిస్తున్నారు.ఈ తరహా లక్షణం కరోనా వైరస్ సోకిన చిన్నారుల్లో కనిపిస్తోందని చెబుతున్నారు.
సాధారణంగా కరోనా బాధితుల్లో దగ్గు, జలుబు, రుచి లేదా వాసన కోల్పోవడం లక్షణాలు మొదట్లో కనిపించాయి.
అయితే ఆ తరువాత కరోనాకు సంబంధించిన కొత్త లక్షణాలు వెలుగులోకి వచ్చాయి.
తాజాగా నిపుణులు పిల్లల్లో ఆకలి తగ్గడం కూడా కరోనా లక్షణమేనని… పెద్దలతో పోలిస్తే పిల్లల్లో కరోనా లక్షణాలు భిన్నంగా కనిపిస్తున్నాయని చెబుతున్నారు.వాస్తవానికి పెద్దలతో పోలిస్తే పిల్లలపై కరోనా వైరస్ ప్రభావం చూపే అవకాశాలు తక్కువ.
లండన్ లోని కింగ్స్ కాలేజీలోని జన్యు ఎపిడెమియాలజీ ప్రొఫెసర్ టిమ్ స్పెక్టర్ పిల్లలు ఎక్కువగా అలసట, జ్వరం, గొంతు నొప్పి, తినకపోవడం, తలనొప్పి లాంటి ఐదు కరోనా లక్షణాలతో బాధ పడుతున్నారని తెలిపారు.
పిల్లల్లో తలనొప్పి, భోజనం తినకపోవడం, అలసట కనిపిస్తే వైద్యసాయం తీసుకోవాలని… కరోనా సోకిన చిన్నారులు, హై స్కూల్ విద్యార్థుల మధ్య పెద్దగా తేడాలు లేవని చెప్పారు.
కరోనా సింప్టమ్ ట్రాకర్ యాప్లో వైరస్ సోకిన 3,00,000 మంది పిల్లల డేటా ఉందని… ఈ జాబితా ద్వారా పిల్లలు ఏ విధంగా వైరస్ బారిన పడుతున్నారో తెలుస్తోందని నిపుణులు వెల్లడించారు.కరోనా లక్షణాలు ఒక్కో వయస్సు వారిలో ఒక్కోలా ఉంటాయని తెలిపారు.