ఏపీలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశవ్యాప్తంగా మరెక్కడా అమలు కావడం లేదని, తమను చూసే ఇతర రాష్ట్రాల్లో తాము ప్రవేశపెట్టిన పథకాలను ప్రారంభిస్తున్నారు అని, ఇలా ఎంతో గొప్పగా అధికార పార్టీ వైసిపి ప్రచారం చేసుకుంటోంది.అయితే వేల కోట్ల రూపాయలు వివిధ పథకాల పేరుతో జనాలకు అందేలా జగన్ ప్రభుత్వం చేస్తున్నా, దానికి డబ్బులు ఎక్కడి నుంచి తెస్తున్నారు ? ఎలా తెస్తున్నారు అనే ప్రశ్న చాలా కాలం నుంచి వినిపిస్తోంది.కరోనా కష్టకాలంలో సంక్షేమ పథకాలు నిరంతరంగా జగన్ ప్రభుత్వం అందించింది.ఇప్పటికీ వరుసగా అనేక పథకాలను అమలు చేస్తూనే వస్తోంది.అయితే కొద్ది రోజులుగా ప్రభుత్వ పెద్దలు ఆర్థిక వ్యవహారాలపై కాస్త కంగారు పడుతున్నట్లు గా కనిపిస్తున్నారు.తాజాగా ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడిన మాటలు పరిస్థితికి అర్థం పడుతున్నాయి.
ఏపీ ప్రభుత్వం అప్పుల్లో ఉందని, ఉద్యోగులకు జీతాలు చెల్లించడం భారంగా మారిందని, కరోనా కారణంగా ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయ్యింది అంటూ ఆయన మాట్లాడిన మాటలు ప్రస్తుత పరిస్థితికి అద్దం పడుతున్నాయి.కొత్త పథకాలు సంగతి పక్కన పెడితే, ఉన్న పథకాలకు భారీగా సొమ్ములు వెచ్చించాల్సిన పరిస్థితి ఉంది.దీంతో ఏపీ ప్రభుత్వం కొత్త రుణాల కోసం ప్రపంచ బ్యాంకు ను సంప్రదించినట్లు తెలుస్తోంది.‘సాల్ట్ ‘ ప్రాజెక్టు అమలు కోసం సుమారు రూ.1870 కోట్ల రుణం ఇవ్వడానికి ప్రపంచ బ్యాంకు విధించిన షరతులకు వైసీపీ ప్రభుత్వం అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది.అయితే ప్రపంచ బ్యాంకు రుణాలు ఆషామాషీగా అయితే ఇవ్వదు.
ఎన్నో షరతులు విధిస్తుంది.సంక్షేమ పథకాల్లో కోత విధించడంతో పాటు పన్నుల పెంపు, ఉద్యోగుల జీతాలలోనూ కోత, ప్రైవేటీకరణ ఇలా అనేక వాటిని అమలు చేయాలని షరతులు విధిస్తుంది.
ఇదిలా ఉంటే ఏపీ ఆర్థిక దుస్థితిపై వైసిపి రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు కేంద్రానికి రాసిన లేఖ పెద్ద సంచలనంగా మారడంతో పాటు, ఏపీ ప్రభుత్వం ఇబ్బందులు పడడానికి కారణమైంది.
రఘురామ రాసిన లేఖ పై కేంద్రం వెంటనే రియాక్ట్ అయ్యింది.ఏపీ చేస్తున్న అప్పుల పై ఆగ్రహం వ్యక్తం చేసింది.రాబోయే 20 ఏళ్లలో మద్యం ద్వారా వచ్చే ఆదాయాన్ని గ్యారెంటీగా పెట్టి అప్పులు చేస్తుండటంపై రఘురామ తన లేఖలో ప్రస్తావించారు.
ఇది రాజ్యాంగ విరుద్ధమని, భవిష్యత్తు ఆదాయాలను ఎలా తాకట్టు పెట్టి అప్పులు చేస్తారంటూ కేంద్ర ఆర్థిక శాఖ విభాగం, ఏపీ ప్రభుత్వానికి రాసిన లేఖ రాయడం ఇప్పుడు ఇబ్బందికరంగా మారింది.అదీ కాకుండా ఏపీ అభివృద్ధికి కార్పొరేషన్ ద్వారా రుణ సేకరణ చేయడం సరికాదంటూ కేంద్ర ఆర్థిక శాఖ తప్పుబట్టింది.