ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తి తరచు భార్యతో గొడవ పడుతూ క్షణికావేశంలో భార్య నిండు గర్భిణీ అని ఆలోచించకుండా దారుణ హత్యకు పాల్పడిన ఘటన వరదయ్యపాలెం మండలంలో చోటుచేసుకుంది.కట్టుకున్నోడే గర్భిణీని హత్య చేయడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది.
అందుకు సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.
వరదయ్యపాలెం( varadayyapalem ) మండలంలోని బత్తల వల్లం హరిజన వాడకు చెందిన కాటయ్య, ఇరకం పావని( Kataiya, Irakam Pavani )(26) అనే యువతిని ప్రేమించి ఎనిమిది సంవత్సరాల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు.వీరికి ఇద్దరు పిల్లలు సంతానం.
కొంతకాలం వరకు వీరి ప్రేమ వివాహం సాఫీగానే సాగింది.అయితే పావని పై అనుమానం పెంచుకున్న కాటయ్య తరచూ గొడవపడి చీటికిమాటికి భార్యపై చేయి చేసుకునేవాడు.
ఈ క్రమంలోనే భార్య నిండు గర్భిణి అని కాస్తయినా కనికరం లేకుండా దారుణ హత్యకు పాల్పడి ఉంటాడని గ్రామస్తులు భావిస్తున్నారు.గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించడంతో సీఐ శివకుమార్ రెడ్డి, ఎస్సై నాగార్జున రెడ్డి ( CI Sivakumar Reddy, SC Nagarjuna Reddy )ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు.అనంతరం పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని సత్యవేడు ఏరియా ఆసుపత్రికి తరలించారు.ఈ ఘటనపై సీఐ శివకుమార్ రెడ్డి చుట్టుపక్కల ఉండే గ్రామస్తులను విచారించగా.భార్యాభర్తల మధ్య సరైన సత్సంబంధాలు లేవని, చీటికిమాటికి ఇంట్లో గొడవ జరిగేదని తెలిపారు.హత్య కేసు నమోదు చేసుకున్న పోలీసులు హత్య చేయడానికి గల కారణాలు ఏమిటి.
హత్యకు కారకులు ఎవరైనా ఉన్నారా అనే కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు.నిందితుడు కాటయ్యను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు.
నిండు గర్భిణిని హత్య చేసిన కాటయ్యను కఠినంగా శిక్షించాలని స్థానికులు కోరుతున్నారు.తల్లి హత్యకు గురి కావడం, తండ్రి జైలుకు వెళ్లడంతో ఆ ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు.