రాజన్న సిరిసిల్ల జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులు ఎన్నికల ప్రక్రియ, ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి అనురాగ్ జయంతి అన్నారు.పోలింగ్ రోజు పోలింగ్ కేంద్రాల్లో అధికారులు చేయవలసిన విధులపై జిల్లాలో గుర్తించిన ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులకు , సెక్టార్ అధికారులకు సిరిసిల్ల పట్టణంలోనీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో శిక్షణా కార్యక్రమం నిర్వహించారు.
ఈ శిక్షణ కార్యక్రమాలను జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ ఎన్ ఖీమ్యా నాయక్ తో కలిసి పరిశీలించారు.పోలింగ్ డే రోజు ప్రిసైడింగ్ , సహాయ ప్రిసైడింగ్ అధికారులు చేయాల్సిన ముఖ్య పనులపై దిశా నిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి మాట్లాడుతూ, ఎన్నికల ప్రక్రియ, ఎన్నికల కమీషన్ నిర్దేశించిన నియమ, నిబంధనల పై ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులకు సంపూర్ణ అవగాహన ఉండటం చాలా కీలకమని, ముఖ్యమైన నిబంధనల పట్ల అవగాహన కలిగి ఉంటే నమ్మకం తో పారదర్శకంగా ఎన్నికల ప్రక్రియ సజావుగా నిర్వహించవచ్చని కలెక్టర్ అన్నారు.
హ్యాండ్ బుక్ ఫర్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ -2023 బుక్ లోని అన్ని నిబంధనలను జాగ్రత్తగా చదవాలన్నారు.
ఎన్నికల సమయంలో పాటించాల్సిన విధులపై ఎన్నికల కమిషన్ అందించే పుస్తకాలను సంపూర్ణంగా చదవాలని, ముఖ్యమైన సెక్షన్, నిబంధనలు హైలైట్ చేసుకోవాలని, మనం నిబంధనల ప్రకారం ప్రవర్తిస్తే ఎలాంటి ఇబ్బందులు ఎదురుకావని అన్నారు.పోలింగ్ జరిగే సమయంలో పోలింగ్ కేంద్రాల్లో పాటించాల్సిన నిబంధనలు, కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్, వివి ప్యాట్ మధ్యలో కనెక్షన్, ఓటింగ్ కంపార్ట్మెంట్ రూపొందించడం, ఓటరు గోప్యంగా తన ఓటు హక్కు వినియోగించేందుకు అవకాశం కల్పించడం వంటి ఏర్పాట్లపై ప్రెసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులు తీసుకోవాల్సిన చర్యలు, వారికి ఉన్న హక్కులు, బాధ్యత లను సంపూర్ణంగా తెలుసుకొని ప్రతి పోలింగ్ అధికారికి అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు.
గత ఎన్నికల సమయంలో ఎదురైన సమస్యలు, అనుభవాలను దృష్టిలో ఉంచుకొని అవి పునరావృతం కాకుండా వాటి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలపై చర్చించాలని, ఎన్నికల సమయంలో ఎన్నికల కమిషన్ నూతన సూచనలు ఆదేశాలు జారీ చేస్తుందని వాటిని పాటించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన పెంచుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు.మాక్ పోలింగ్ కు ఏజెంట్ లు రాకపోతే అనుసరించాల్సిన విధానం, మాక్ పోల్ నిర్వహణ, పోలింగ్ పూర్తి అయిన తర్వాత చేయాల్సిన పనుల పై జిల్లా కలెక్టర్ వివరించారు.
పోలింగ్ రోజు ఏమైనా సందేహాలు ఉన్న, సమస్యలు ఎదురైనా సెక్టార్ అధికారులకు తెలియజేయాలన్నారు.కాగా ఈ శిక్షణ కార్యక్రమాలు రేపు, ఎల్లుండి కూడా జరగనున్నాయి.
ఈ కార్యక్రమంలో ఆర్డీఓ లు ఆనంద్ కుమార్, మధు సూదన్, ప్రత్యేక ఉప కలెక్టర్ బి గంగయ్య, సీపీవో పిబి శ్రీనివాస చారి, బి డబ్ల్యు ఓ లక్ష్మి రాజం తదితరులు పాల్గొన్నారు.