ఆస్కార్ అవార్డు అందుకున్న తర్వాత వివిధ ఆలయాలు సందర్శిస్తూ తిరుమలకు రావడం తృప్తిని కలిగించిందని సినీ గేయ రచయిత చంద్రబోస్ ఆనందం వ్యక్తం చేశారు.మంగళవారం ఉదయం తిరుమల శ్రీవారి నైవేద్య విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి చంద్రబోస్ స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.
దర్శనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వీరికి వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.అనంతరం ఆలయ వెలుపలకు వచ్చిన చంద్రబోస్ మీడియాతో మాట్లాడుతూ.
ఆస్కార్ అవార్డు అందిన తర్వాత వివిధ ఆలయాలను సందర్శిస్తూ వస్తున్నామని, ఇందులో భాగంగానే నిన్న తిరుమలకి చేరుకుని మంగళవారం ఉదయం స్వామివారి దర్శన భాగ్యం పొందడం జరిగిందన్నారు.స్వామి వారి దర్శన భాగ్యం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని, స్వామి వారి దర్శనంతో గుండె ఆనంద పరవశంతో నిండిపోయిందన్నారు.
ప్రస్తుతం పుష్ప-2, వెంకటేష్ నటించిన సైంధవ, రవితేజ నటిస్తున్న టైగర్ నాగేశ్వరరావు, రాఘవేంద్ర రావు సినిమాలకు గేయాలు రాస్తున్నానని, అదేవిధంగా పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు, రామ్ చరణ్ అప్కమింగ్ ప్రాజెక్టులలో పాటలు రాస్తున్నట్లు సినీ గేయ రచయిత చంద్రబోస్ తెలియజేశారు.