రాజన్న సిరిసిల్ల జిల్లా : పరీక్షల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు.మంగళవారం ఆయన తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని పరీక్షా కేంద్రాలను, పరీక్ష నిర్వహణ తీరును క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూడాలని సిబ్బందిని ఆదేశించారు.పరీక్షల సమయంలో విద్యార్థులకు ఇబ్బంది లేకుండా తాగునీరు, టాయిలెట్ల సౌకర్యాలు కల్పించాలని చీఫ్ సూపరింటిండెంట్కు సూచించారు.
సీసీ కెమెరాల పనితీరును కలెక్టర్ పరిశీలించారు.సీసీ కెమెరాల పర్యవేక్షణలోనే ప్రశ్నపత్రాలను ఓపెన్ చేయాలని అన్నారు.
ప్రథమ చికిత్స వంటి సౌకర్యాలు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.రెండు పరీక్షా కేంద్రాల్లో ఏ కేంద్రంలో ఎంతమంది హాజరయ్యారనే వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.సెంటర్ “ఏ” లో 209 మందికి గానూ 209 మంది హాజరయ్యారని, సెంటర్ “బి” లో 200 మందికి గానూ 200 మంది హాజరయ్యారని జిల్లా కలెక్టర్ కు చీఫ్ సూపరింటెండెంట్ లు వివరించారు.ఈ తనిఖీలో కలెక్టర్ వెంట జిల్లా విద్యాధికారి ఏ.రమేష్ కుమార్, తహశీల్దార్ సదానందం, చీఫ్ సూపరింటెండెంట్ లు రవీందర్, శాబొద్దీన్, తదితరులు పాల్గొన్నారు.