తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఏడాది వాన కాలంలో జూన్, జూలై మాసాలలో హరిత హారం అనే మొక్కలు నాటే కార్యక్రమాన్ని అమలు చేస్తున్నది.ఇప్పటికీ దాదాపు ఐదు హరిత హారం కార్యక్రమాలను పూర్తి చేసింది తెలంగాణ ప్రభుత్వం.
ఈ సంవత్సరము ఆరో విడత హరిత హారం కార్యక్రమం చేపడుతోంది.హరితహారం కార్యక్రమం లో భాగంగా ఈ కార్యక్రమాన్ని అటవీ శాఖ, పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ, మున్సిపల్ శాఖలు కలిసి ఉమ్మడిగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
ఇలాంటి కార్యక్రమాలు అమలు చేస్తున్నప్పుడు ఒక్కోసారి అధికారులే నేరాలకు పాల్పడుతుండడం మనం వింటుంటాం.కానీ, ఇక్కడ విచిత్రం ఏమంటే ఈ కార్యక్రమంలో జంతువులు కూడా నేరాలు చేశాయి.
ఇందుకు నిదర్శనంగా కొత్తగూడెం జిల్లాలోని ఇల్లందులో 15 మేకలు ఘోరమైన నేరం చేశాయి.ఆ నేరం ఏమిటంటే… హరిత హారం కార్యక్రమంలో నాటిన మొక్కల ఆకులను మేకలు తినేశాయి.పాపము… ఆ మేకలకు ఇవి ప్రభుత్వము నాటిన మొక్కలను మనము తినకూడదు అని తెలియదు.ఆ మేకలు పచ్చగా ఉన్నాయి కదా అని ఆకులు తినేశాయి కాబోలు.
ఆ తర్వాత, మొక్కలను మేకలు తిన్నాయి అన్న విషయాన్ని మున్సిపల్ సిబ్బంది కనుక్కొని ఇల్లందు కమిషనర్ గా పనిచేయుచున్న శ్రీనివాస రెడ్డి కి తెలియజేశారు.కమిషనర్ గారు ఒక్కో మేకకు రూ.3000 జరిమానా విధించారు.దింతో మున్సిపల్ సిబ్బంది కాపు కాసి మరీ చివరకు 15 మేకలను పట్టుకున్నారు.
ఆపై వాటిని తెచ్చి మున్సిపల్ ఆఫీస్ లో కట్టి ఉంచారు.ఎలాగైతేనేమి మేకల యజమానుల ఫోన్ నెంబర్లను కనుక్కొని వాట్సప్ ద్వారా మెసేజ్ పంపారు.
అందులో జరిమానా చెల్లించి మీ మేకలను తీసుకొని పోవలసినదిగా ఆదేశాలను జారీ చేశారు.కానీ ఇంతవరకు మేకల కు సంబంధించిన యజమానులు ఒక్కరు కూడా రాలేదు.