జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి సీఎం అయిపోతా అంటూ ప్రసంగాలు దంచేస్తూనే ఉన్నాడు.వారసత్వ రాజకీయాలకు జనసేన దూరం అని, సాంప్రదాయ రాజకీయాలకు ప్రత్యామ్న్యాయంగా జనసేన ఆవిర్భవించింది అని చెప్పుకొచ్చిన పవన్ తమ పార్టీ ద్వారా నీతివంతమైన అభ్యర్థులను ఎంపిక చేసి నిలబెడతామని ఇతర పార్టీల నుంచి వలస వచ్చే నాయకులకు తమ పార్టీలో చోటు లేదని చెప్పాడు.
అంతే కాకుండా తమ పార్టీ తరపున పోటీ చేయాలనుకునే అభ్యర్థులు ముందుగా అప్లికేషన్ పెట్టుకోవాలని , పరీక్ష రాయాలని అందులో పాస్ అవ్వాలని వారిని స్క్రీనింగ్ కమిటీ ఎంపిక చేసి టికెట్లు కేటాయిస్తుందని పవన్ చెప్పుకొచ్చారు.అయితే క్షేత్ర స్థాయిలో మాత్రం అవేవి జరగలేదు.
అభ్యర్థుల ఎంపిక కోసం అప్లికేషన్ పెట్టి, పరీక్ష రాసిన వారిలో అతి తక్కువ మందికి మాత్రమే టికెట్ దక్కగా మిగిలిన వారంతా తమ పార్టీలో టికెట్ దక్కలేదని రాత్రికి రాత్రి పార్టీ మారి జనసేన కండువా వేయించుకుని టికెట్ దక్కించుకున్నవారే కనిపిస్తున్నారు.అంతకు ముందు ప్రజాపోరాట యాత్రల్లో పాల్గొన్న పవన్ వెళ్లిన ప్రతీ చోటా చంద్రబాబు, జగన్ కుటుంబాలే రాజకీయాలు చెయ్యాలా ? వారికి మద్దతు ఇచ్చే కుటుంబాల వారు వారి వారసులే రాజకీయ నాయకులు అవ్వాలా ? సామాన్య ప్రజలకు చోటు లేదా అంటూ ఆవేశంగా ప్రశ్నించారు.కాకపోతే జనసేన కూడా అందుకు మినహాయింపు కాదని రుజువు చేసేలా పార్టీలో టికెట్ల కేటాయింపులు జరగడం విమర్శలకు తావిస్తోంది.
కర్నూల్ జిల్లా విషయానికి వస్తే జనసేన నుంచి ఒకే కుటుంభానికి చెందిన ముగ్గురికి టికెట్లు దక్కడం ఇప్పుడు చర్చగా మారింది.ఎస్పీవై రెడ్డి కుటుంబం ఈ రికార్డును బ్రేక్ చేసింది.నంద్యాల ఎంపీగా ఎస్పీవై రెడ్డి పోటీ చేస్తుండగా, ఆయన చిన్న కుమార్తె అరవిందరాణి బనగానపల్లి శాసనసభ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు.ఇక పెద్ద అల్లుడు సజ్జల శ్రీధర్రెడ్డి నంద్యాల శాసనసభ బరిలో ఉన్నారు.2014లో వైసీపీ టిక్కెట్ పై గెలిచినా ఎస్పీవై రెడ్డి ఎన్నికల ఫలితాల తరువాత మూడో రోజునే టీడీపీలో గూటికి చేరారు.కాకపోతే ఆ పార్టీ ఆయన అడిగినన్ని టిక్కెట్లు ఇవ్వకపోవడంతో అలిగి పవన్ కళ్యాణ్ వద్దకు చేరారు.