దేశవ్యాప్తంగా గోధుమలు, వాటి ఉత్పత్తుల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇటీవల కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.భారత్ నుంచి గోధుమల ఎగుమతులపై నిషేధం విధించింది.
అయితే ఈ నిర్ణయంపై ప్రపంచ దేశాలు భగ్గుమంటున్నాయి.దీనిపై పునరాలోచించాలని ఇటీవల జీ-7 దేశాల విదేశాంగ మంత్రులు భారత్కు విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే.
ఇప్పటికే రష్యా- ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఆహార ధాన్యాల ఎగుమతుల్లేక ఆఫ్రికా, మధ్యప్రాచ్య దేశాల్లో ఆహార కొరత ఏర్పడనుందని జీ7 దేశాల విదేశాంగ మంత్రులు ఆందోళన వ్యక్తం చేశారు.ఈ తరుణంలో భారత్ గోధుమల ఎగుమతులపై నిషేధం విధించడం తగదని, ఇది పరిస్థితిని ఇంకా దిగజార్చుతుందని జర్మనీ వ్యవసాయశాఖ మంత్రి సెమ్ ఓజ్డెమిర్ పేర్కొన్నారు.ప్రతి దేశం ఆహార ధాన్యాల ఎగుమతులు నిలిపివేస్తే ఇతర దేశాల్లో ప్రజలు ఆకలితో అలమటిస్తారని, తద్వారా సంక్షోభం తలెత్తే అవకాశం ఉందన్నారు.జీ-20 సభ్య దేశంగా ప్రపంచానికి ఆహారం అందించే బాధ్యత భారత్ తీసుకోవాలని, గోధుమల ఎగుమతులపై మరోసారి పునరాలోచించాలని ఓజ్డెమిర్ కోరారు.
తాజాగా భారత్ నిర్ణయంపై ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారి సైతం ఆందోళన వ్యక్తం చేశారు.భారత్ ఎగుమతులు తగ్గిస్తే ఆహార కొరత ఎక్కువవుతుందని అమెరికా రాయబారి థామస్ గ్రీన్ఫీల్డ్ స్పష్టం చేశారు.
పేద దేశాల ఆహార సంక్షోభాన్ని భారత్ అర్థం చేసుకోవాలని థామస్ విజ్ఞప్తి చేశారు.గతంలో అభివృద్ది చెందుతున్న దేశాలకు గతంలో ఉక్రెయిన్ నుంచి గోధుమలు ఎగుమతయ్యేవని గుర్తుచేశారు.
అయితే యుద్ధం కారణంగా ఉక్రెయిన్లోని కీలక ఓడరేవులను రష్యా ఆక్రమించడంతో ఈ పరిస్ధితి తలెత్తిందని ఆయన తెలిపారు.మరోవైపు.నాలుగు రోజుల పాటు అమెరికాలోని న్యూయార్క్లో జరగనున్న గ్లోబల్ ఫుడ్ సెక్యూరిటీ- కాల్ టూ యాక్షన్ సదస్సుకు కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి వీ .మురళీధరన్ హాజరుకానుండటంతో అమెరికా ఒత్తిడి తెచ్చే అవకాశం వుందని నిపుణులు భావిస్తున్నారు.
కాగా.గోధుమల ఉత్పత్తికి సంబంధించి ప్రపంచంలోనే భారత్ రెండో స్థానంలో వుంది.అయితే ఈ ఏడాది దేశంలో గోధుమ దిగుబడి గణనీయంగా తగ్గిపోయింది.మే 13 నాటికి ఎఫ్సీఐ కేవలం 17 మెట్రిక్ టన్నులు మాత్రమే సేకరించింది.గతేడాదితో పోలిస్తే ఇది సగమే.ఉత్తర, పశ్చిమ, మధ్య ప్రాంతాల్లో వీస్తున్న వేడి గాలులే గోధుమ దిగుబడి తగ్గడానికి కారణమని పరిశోధకులు అంచనా వేస్తున్నారు.
గోధుమ ఉత్పత్తుల్లో రష్యా తొలి స్థానంలో వుండగా.ఉక్రెయిన్ నాలుగో స్థానంలో వుంది.
ప్రస్తుతం యుద్ధం కారణంగా ఆ రెండు దేశాల నుంచి ఎగుమతులు నిలిచిపోయాయి.దీంతో ప్రపంచం భారత్ వైపు ఆశగా ఎదురుచూస్తోంది.
ఇలాంటి పరిస్ధితుల్లో భారత్ ఎగుమతులపై నిషేధం విధించడం ఆయా దేశాలను ఆందోళనకు గురిచేస్తోంది
.