ఎన్నికల ముహూర్తం ముంచుకుని వచ్చేస్తుండడంతో అన్ని రాజకీయ పార్టీలు హైరానా పడుతున్నాయి.అందుకే… ఎక్కడ బలం ఉందో ఎక్కడ బలహీనతలు ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి.బలం ఉన్న చోట మరింత బలం పెరిగేలా… బలహీనంగా ఉన్న చోట పుంజుకునేలా తగిన ప్రణాళికలు వేసుకుంటున్నాయి.ఈ విషయంలో జనసేన పార్టీ కాస్త కంగారు ఎక్కువ పడుతోంది.ఎందుకంటే… మొదటిసారి ఎన్నికల బరిలోకి వెళ్ళబోతున్నందున కొంచెం టెన్షన్ పడుతోంది.అందుకే… ఆ పార్టీ అధినేత పవన్ బలహీనంగా ఉన్న జిల్లాలపై ప్రధానంగా…దృష్టిపెట్టాడు.
ముఖ్యంగా జనసేన పార్టీకి ఎంతో కీలకంగా… భావిస్తున్న ఉత్తరాంధ్ర జిల్లాలపై జనసేన దృష్టి సారించింది.పవన్ కళ్యాణ్ గత ఏడాది జూన్, జూలై నెలల్లో ఈ మూడు జిల్లాల్లోనూ విస్తృతంగా పర్యటించారు.అప్పట్లో కొంతమంది నేతలు కూడా పార్టీలో చేరారు.ఆ తరువాత పవన్ పెద్దగా పట్టించుకోలేదు.అందుకే… పవన్ ఇక్కడ పర్యటించినప్పుడు కనిపించినంత ఆదరణ తరువాత లేకపోవడంతో పాటు, పార్టీలోకి పెద్దగా చేరికలు కూడా లేకుండా పోయాయి.దాంతో పట్టున్న చోట బలపడాలన్న ఉద్దెశ్యంలో జనసేనాని ఈ మూడు జిల్లాలపై ప్రత్యేక దృష్టిపెట్టాడు.
ఈ మూడు జిల్లాలను కంచుకోటల్లా మార్చుకోవాలని పవన్ చూస్తున్నాడు.
సంక్రాంతి పండుగ అనంతరం … ఉత్తరాంధ్ర జిల్లాల పార్టీ నాయకులు, క్యాడర్ తో పవన్ కళ్యాణ్ భారీ మీటింగ్ ఒకటి ఏర్పాటు చేసేందుకు తగిన ప్రణాళికలు వేస్తున్నాడు.ఆ మీటింగ్ ద్వారా మొత్తం 34 అసెంబ్లీ, అయిదు పార్లమెంట్ సీట్లలో పార్టీ పరిస్థితి ఏంటన్న దానిపై పూర్తిగా సమీక్ష నిర్వహించి ఎక్కడికక్కడ మరమ్మతులు చేపడతారని తెలుస్తోంది.అదే సమయంలో పార్టీలోకి మరిన్ని చేరికలను కూడా ప్రోత్సహించాలని పవన్ భావిస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఇది ఇలా ఉంటే… వైసీపీ, టీడీపీల్లో ఉన్న ద్వితీయ శ్రేణి నాయకులు జనసేనలో టికెట్ ఇస్తే చేరుతామని రాయబేరాలు పంపుతున్నట్లుగా తెలుస్తోంది.ఈ విషయాలపైనా ఏదో ఒక క్లారిటీ ఇస్తే మరిన్ని చేరికలు ఉండే అవకాశం ఉంటుంది అని పవన్ కూడా ఒక అంచనాకు వచ్చినట్టు తెలుస్తోంది.