రాజన్న సిరిసిల్ల జిల్లా :సీఎం కెసిఆర్ ప్రత్యేక చొరవతో దేశానికి దిక్సూచి గా తెలంగాణ పోలీసు సేవలు ఉన్నాయని రాజన్న సిరిసిల్ల జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ న్యాలకొండ అరుణా రాఘవరెడ్డి అన్నారు.తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఆదివారం జిల్లా కేంద్రంలో పద్మ నాయక ఫంక్షన్ హాల్ లో తెలంగాణ సురక్ష దినోత్సవాన్ని జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమాలలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, మున్సిపల్ చైర్ పర్సన్స్ జిందం కళ చక్రపాణి, రామతీర్డపు మాధవి రాజు లతో కలిసి జడ్పీ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవ రెడ్డి పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ మాట్లాడుతూ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి మన సిఎం కెసిఆర్ నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం పోలిస్ వ్యవస్తకు పెద్ద పీట వేస్తుందన్నారు.మన తెలంగాణ రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలిసింగ్ విధానాన్ని తీసుకువచ్చి ప్రజల యొక్క సమస్యలను ఫ్రెండ్లీగా పరిష్కరిస్తూ ప్రజలకు సేవలు అందిస్తున్నారన్నారు.
మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ వ్యవస్తను పటిష్ట పరిచి ఎటువంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటుందన్నారు.సమైఖ్య రాష్ట్రంలో పాస్ పోర్ట్ వెరిఫికేషన్ కావాలంటే నెలలు వేచి చూసుడు ఉండే, అదే మన కెసిఆర్ నాయకత్వంలోని స్వరాష్ట్రంలో దేశ విదేశాలకు ఉపాధి కొరకు, చదువు కొరకు వెళ్ళే వారికి ఇబ్బంది కలగవద్దు అనే ఉద్దేశ్యంతో
పాస్ పోర్ట్ వెరిఫికేషన్ ను సత్వరంగా పూర్తి చేస్తున్నారన్నారు.
పాస్ పోర్ట్ వెరిఫికేషన్ ప్రక్రియను సత్వరంగా పూర్తి చేయడంలో తెలంగాణ పోలీసు గత 8 సంవత్సరాలుగా దేశంలోనే నంబర్ వన్ గా నిలవడం అంటే వారి యొక్క నిబద్దతకు నిదర్శనమన్నారు.మన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా మహిళల, బాలికల సంరక్షణ కొరకు ఎంతో పాటుపడుతుందన్నారు.
మహిళా సంరక్షణ కొరకు షీ టీమ్స్, సఖి సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.గ్రామాలలో, పట్టణాల్లో పటిష్ట నిఘా కొరకు సిసి కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
హైదరాబాద్ లో పోలీసు కమాండ్ కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేసి విశిష్ట సేవలు అందించడం జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో సీడీపీఓ లు ఎల్లయ్య, అలేఖ్య, పోలీసులు, మహిళలు పాల్గొన్నారు.