రాజన్న సిరిసిల్ల జిల్లాలో సహకార సంఘాల బలోపేతానికి పటిష్ట చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్( Kheemya Naik ) అన్నారు.శనివారం జిల్లా అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని తన చాంబర్ లో జిల్లా సహకార అభివృద్ధి కమిటీ సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం దేశంలో ఉన్న 34 రాష్ట్ర సహకార సంఘాల ద్వారా దాదాపు 5 లక్షల కోట్ల రుణాల పంపిణీ జరుగుతుందని, సహకార సంఘాల ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని అన్నారు.సహకార సంఘాల బలోపేతానికి ప్రణాళికబద్ధంగా చర్యలు తీసుకోవాలని ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం జిల్లా సహకార అభివృద్ధి కమిటీని ఏర్పాటు చేసిందని అన్నారు.
మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా సహకార అధికారి కన్వీనర్ గా 11 మంది సభ్యులతో జిల్లా సహకార అభివృద్ధి కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.
జిల్లాలో 24 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, 106 మత్స్యకార సహకార సంఘాలు, 31 డైయిరీ సంఘాలు, ప్యాక్స్ ఆద్వర్యం లో 10 రిటైల్ పెట్రోల్ పంపు లు ఉన్నాయని అన్నారు.
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం రూపొందించిన కిసాన్ సమృద్ధి కేంద్రాలు, కామన్ సర్వీస్ కేంద్రాలను మన జిల్లాలో కట్టుదిట్టంగా అమలు చేస్తున్నామని, ధాన్యం నిల్వల కేంద్రం నిర్మాణ ప్రణాళిక దిశగా గంభీరావుపేట్ లో రైస్ మిల్ కం గోడౌన్ నిర్మించామని, జాతీయస్థాయిలో ఉన్న సీడ్స్ సోసైటీ లో సహకార సంఘంలో ఉన్న రైతులు రిజిస్టర్ చేయించుకున్నారని అన్నారు.జిల్లాలో ఉన్న 106 మత్స్య సహకార సంఘాలకు ఎన్నికల నిర్వహించి జిల్లా ఫెడరేషన్ ఏర్పాటు చేశామని , మత్స్య సహకార సంఘాల అభివృద్ధి కోసం అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని, అదేవిధంగా డైయిరీ సంఘాల బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించి నివేదికలు అందించాలని అన్నారు.
జిల్లాలో ఉన్న ప్రాథమిక వ్యవసాయ సహకార సంస్థలకు జిల్లా సహకార సెంట్రల్ బ్యాంక్ ( Central Banks )లకు అవసరమైన లింకేజ్ ఏర్పాటు చేయాలని, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల, మత్స్య సహకార సంఘాలు, డైయిరీ సంఘాలకు ప్రభుత్వం అందిస్తున్న వివిధ పథకాలను కట్టుదిట్టంగా అమలు చేసి వాటి ఆర్థిక అభివృద్ధికి తోడ్పాటు అందించాలని అన్నారు.
జిల్లాలోని అన్ని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలలో అవసరమైన వసతులు కల్పించాలని, సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుంటూ సహకార సంఘాల బలుపేతానికి కృషి చేయాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సహకార అధికారి భుద్ద నాయుడు, జిల్లా వ్యవసాయ అధికారి భాస్కర్ , జిల్లా పశు సంవర్థక శాఖ అధికారి డా.కొమురయ్య, జడ్పీ డిప్యూటీ సీఈవో గీతా, డి.డి.ఎం.నాబార్డ్ జయ ప్రకాష్ సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.